న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: బ్యాడ్ బ్యాంక్గా వ్యవహరిస్తున్న నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) జారీచేసే సెక్యూరిటీ పత్రాలకు ప్రభుత్వ గ్యారంటీని ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్&బ్యాంకుల నుంచి కొనుగోలుచేసే మొండి బకాయిల విలువలో 15 శాతం నగదుగానూ, 85 శాతం ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చిన సెక్యూరిటీ పత్రాల రూపంలోనూ చెల్లించనుంది. నిర్ణీతకాలంలో బ్యాంకులు బ్యాడ్ బ్యాంక్కు అప్పగించే మొండి బకాయి విలువలో తగ్గుదల ఏర్పడితే ప్రభుత్వ గ్యారంటీగా వున్న సెక్యూరిటీ ద్వారా బ్యాంకు నగదుగా మార్చు కుంటుంది. ప్రభుత్వ గ్యారంటీలు రూ.31,000 కోట్ల వరకూ ఉంటాయని అంచనా. బ్యాంకుల మొండి బకాయిల్ని కొనుగోలు చేసేందుకు ఈ బ్యాడ్ బ్యాంక్ను ఏర్పాటుచేసే బాధ్యతను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు అప్పగించారు. రూ.6,000 కోట్ల మూలధనంతో ఎన్ఏఆర్సీఎల్ను నెలకొల్పేందుకు ఇప్పటికే రిజర్వుబ్యాంక్కు ఐబీఏ దరఖాస్తుచేసింది.