హైదరాబాద్, జూన్ 14: ఆజాద్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.585 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో తమ రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. రాబోయే మూడేండ్లలో అందుబాటులోకి రానున్న ఈ ప్లాంట్తో కొత్తగా 1,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కాగా, ఈ ప్లాంట్ కోసం నిధుల సమీకరణలో భాగంగా తొలి విడుతలో డీఎంఐ మేనేజ్మెంట్ నుంచి రూ.145 కోట్లను ఈ హైదరాబాద్ ఆధారిత సంస్థ అందుకున్నది. ఇక షామీర్పేట్లో ఏర్పాటయ్యే ఈ ప్లాంట్ కోసం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) 50 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. కొత్త ప్లాంట్తో మున్ముందు సంస్థ తయారీ సామర్థ్యం మరింత పెరిగే వీలుండగా, ఏరోస్పేస్, ఎనర్జీ రంగాల సంస్థలతో ఆజాద్ ఇంజినీరింగ్కున్న వ్యాపార సంబంధాలు బలోపేతం కానున్నాయి.
భారీ సంస్థలతో..
జీఈ, మిట్సుబిషి, సీమెన్స్, తొషీబా, ఎంఏఎన్, దూసన్ స్కోడా, జీఈ ఏవియేషన్, బోయింగ్, హనీవెల్, ఈటన్ కార్పొరేషన్, రాఫెల్, బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, బేకర్ హగీస్ తదితర భారీ అంతర్జాతీయ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్తో ఆజాద్ ప్రథమ శ్రేణి భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం గమనార్హం. దీంతో రాబోయే ఐదేండ్లలో రూ.1,800 కోట్లకుపైగా ఆర్డర్లను ఆజాద్ చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న అవకాశాలు, పోటీ, మా ఉత్పత్తుల నాణ్యత.. సంస్థ అభివృద్ధికి పుష్కలంగా దోహదపడగలవు. ఇప్పటికే ఎన్నో ప్రముఖ సంస్థలు మాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. పెరిగే తయారీ సామర్థ్యంతో మరిన్ని రంగాలకు సేవలను విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాం’
-రాకేశ్ చొప్దర్, ఆజాద్ ఇంజినీరింగ్ వ్యవస్థాపకుడు
‘ప్రపంచ స్థాయి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్కు సరఫరాదారుగా ఆజాద్ ఇంజినీరింగ్ నేడు అత్యున్నత స్థానంలో ఉన్నది. ఈ సంస్థకు చేయూతనివ్వడం తెలంగాణ ప్రభుత్వం గర్వంగా భావిస్తున్నది. కొత్త ప్లాంట్తో హైదరాబాద్లోని నైపుణ్యం కలిగిన యువకులకు మెరుగైన ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి’
-జయేశ్ రంజన్, రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి