వేరబుల్ కాంటాక్ట్లెస్తో పరిచయం
న్యూఢిల్లీ, మార్చి 10: కరోనా నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ తమ ఖాతాదారుల కోసం సొంతంగా సరికొత్త కాంటాక్ట్లెస్ పేమెంట్ డివైజ్లను అందుబాటులోకి తెచ్చింది. బ్యాండ్, కీ చైన్, వాచ్ రూపంలో ఉన్న ఈ డివైజ్లను కస్టమర్లు ధరించవచ్చు. వీటి సాయంతో స్మార్ట్ఫోన్, డెబిట్ కార్డు, వాలెట్లు లేకుండానే కొనుగోళ్లు చేయవచ్చు. ఈ డివైజ్లు బ్యాంక్ ఖాతాలకు నేరుగా లింకై ఉంటాయి. కాంటాక్ట్లెస్ లావాదేవీలను అంగీకరించే వ్యాపారులందరి వద్ద ఈ డివైజ్లను వాడుకోవచ్చు.
పీవోఎస్ మెషీన్లపై రూ.5వేల వరకు పిన్ నెంబర్ లేకుండా లావాదేవీలు జరుపుకోవచ్చు. అయితే రూ.5వేలకు మించిన లావాదేవీకి పిన్ అవసరం. ఇక ఈ లావాదేవీలపై 10 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్నూ కస్టమర్లు అందుకోవచ్చు. మాస్టర్కార్డ్పై ఇవి ఎక్స్క్లూజివ్గా అందుబాటులో ఉంటాయని బ్యాంక్ తెలిపింది.
‘వియర్ ఎన్ పే’ పేరుతో డెబిట్ కార్డుల స్థానంలో వచ్చిన ఈ డివైజ్ల కోసం తొలుత రూ.750 వార్షిక ఫీజు చెల్లించాలి. తదనంతరం ఏటా రూ.500 ఉంటుంది. ఖాతాదారులు సమీప బ్యాంక్ శాఖల నుంచి పొందవచ్చు. సురక్షిత లావాదేవీలతోపాటు ఆర్థిక మోసాలను అరికట్టాలన్న లక్ష్యంతో తెచ్చిన ఈ డివైజ్ల వల్ల కస్టమర్లు మోసపోతే 100% నష్టపరిహారం అందనున్నది.