న్యూఢిల్లీ, జూలై 26: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.2,160 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.1,112.17 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. మొండి బకాయిలు పూడ్చుకోవడానికి నిధుల కేటాయింపులు తగ్గుముఖం పట్టడంతో లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.19,032.15 కోట్ల నుంచి రూ.19,591.63 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఏడాది క్రితం 4.72 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తుల విలువ గత త్రైమాసికానికి 3.85 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 1.23 శాతం నుంచి 1.20 శాతానికి దిగొచ్చింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ కేటాయింపులు రూ.4,416.42 కోట్ల నుంచి రూ.3,532.01 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది.