‘ఒకటే మాట, ఒకటే బాణం, ఒకరే సతి’గా ప్రఖ్యాతిగాంచిన శ్రీరాముడు ‘తాను రక్షిస్తానని అభయమిస్తే ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుదిరుగకుండా రక్షంచగల కరుణారసమూర్తి’. క్షత్రియధర్మాన్ని పూర్తి విశ్వాసంతో ఆచరించగల ధీరుడాయన. శ్రీరామచంద్రమూర్తిని నమ్మినవారికి, పూజించినవారికి శుభాలే కలుగుతాయని ‘రామాయణం’లోని పలు సందర్భాలు ధ్రువపరుస్తున్నాయి. శత్రువర్గం నుంచి వచ్చినవాడైనా ‘శరణు’ అన్నవారిని రక్షించటం రాజలక్షణం. దీనికి సాక్ష్యంగా భారతీయ పురాణేతిహాసాల్లో ఎన్నో కథలు మనకు కనిపిస్తాయి. ఇందుకు ‘గయోపాఖ్యానం’ ఒక మంచి ఉదాహరణ.
నదిలో సుప్రభాతాన శ్రీకృష్ణుడు సూర్యునికి అర్ఘ్యప్రదానం చేస్తుంటాడు. ఆకాశంలో ప్రయాణిస్తున్న గయుడు తన నోటినుంచి తాంబూలం ఉమ్మివేయగా, అది కృష్ణుని దోసిట్లో పడుతుంది. ఆగ్రహంతో గయుని శిరసును ఖండిస్తానని శపథం చేస్తాడు. ఇది తెలిసిన గయుడు భయంతో గజగజ వణికిపోయి శివుడిని, బ్రహ్మను శరణు వేడినా, ఫలితం ఉండదు. విష్ణుమూర్తి అవతారుడైన శ్రీ కృష్ణుని శపథం తెలిసి తాము రక్షించలేమంటారు వారు. అర్జునుణ్ణి ఆశ్రయించాలని సలహా ఇస్తారు. గయుడు సవ్యసాచికి పాదాక్రాంతుడై ‘అభయహస్తం’ పొందుతాడు. తర్వాత కృష్ణార్జునుల యుద్ధం జరుగుతుంది. అభయం కారణంగా రాజధర్మం కోసం తనకు బావ, మార్గదర్శి, ఆధ్యాత్మిక గురువైన యాదవుడినే అర్జునుడు ఎదిరించాడు. అలాగే, శిబి చక్రవర్తి తన రాజ్యంలో ప్రాణాపాయ స్థితిలో శరణన్న కపోతాన్ని కాపాడాడు. ఆకలితో ఉన్న డేగ చెప్పిన ధర్మసూక్ష్మాలు విని అంగీకరించి, తన శరీరంలోంచి మాంసం కోసిస్తూ, చివరకు ప్రాణాలు ఇవ్వటానికీ వెనుకాడడు. దేవదత్తుడు బుద్ధ దేవుని హంసకథ మరో ఉదాహరణ.
ఇలా, ఇచ్చిన మాట కోసం పాండవులు, సత్యహరిశ్చంద్రుడు, శ్రీరాముడు పడ్డపాట్లు ఎన్నో. ‘సీతమ్మను అన్యాయంగా అపహరించావని, రాముడికి అప్పగించి శరణు వేడుమని’ రావణాసురునికి తమ్ముడు విభీషణుడు ఎన్నో విధాలుగా విన్నవిస్తాడు. వినకపోయేసరికి విసిగి వేసారి రాముడిని ఆశ్రయిస్తాడు. సేనలతో ఆకాశంలో చేరి రామునికి వర్తమానం పంపుతాడు. రాక్షసరాజైన దశకంఠుని గూఢచారిగా భావించిన వానరులు విభీషణుని రాకను అనుమానించి, వ్యతిరేకిస్తారు. విభీషణుడిపై దాడికి సిద్ధపడుతారు. ఇది గమనించిన రాముడు ఒక్కొక్కరి అభిప్రాయాలు కోరతాడు. ‘విభీషణుని నమ్మవద్దని, కాకుల మధ్యన చేరిన గుడ్లగూబ వలె మనకు హాని చేస్తాడని, దండించి పంపాలని’ సుగ్రీవుడు అంటాడు. విభీషణుని అనుమానించాల్సిందేనని జాంబవంతుడు, ఒక పని అప్పగించి పరీక్షించాలని శరభుడు సూచిస్తారు.
ఇవన్నీ విన్న శ్రీరామచంద్రుడు ప్రశాంతంగా చిరునవ్వుతో సమాధానమిస్తాడు. ‘రాజ్యపాలన చేసేవారు రాజనీతి సూక్ష్మాలు ఆలోచించాలి. అన్నదమ్ముల మధ్య కొట్లాటలు, అభిప్రాయ భేదాలు సహజమే. ఇవి నీకు తెలియవా సుగ్రీవా!’ అంటాడు. ‘అందరూ మంచివారు కాదు, చెడ్డవారూ కాదు. అందరు అన్నదమ్ములు భరతుని వలె ఉండరు. కొడుకులంతా నావలె ఉండరు. నాకు పిశాచ, రాక్షస, యక్షుల వల్ల ఏ భయమూ లేదు. ఎవరైనా నేను నీవాడినీ అని చెప్పి ఒకసారి శరణు వేడితే చాలు అభయమిస్తాను. ఎన్ని కష్టాలెదురైనా విడిచి పెట్టకుండా కాపాడుతాను. విభీషణుని తీసుకురండి’ (వాల్మీకి రామాయణం: యుద్ధకాండ- 18వ సర్గ, 35వ శ్లోకం) అని సుగ్రీవుని కోరతాడు. అన్నట్లే కరుణించి శ్రీలంకకు రాజును చేస్తాడు. అందుకే, శ్రీరామచంద్రుడు అభయహస్తుడు, కరుణారసమూర్తి. శ్రీరామదాసుగా వేలాది కీర్తనలు రాసిన కంచర్ల గోపన్న తన ‘దాశరథీ శతకం’లో ‘కరుణా పయోనిధీ’ మకుటంతో దాశరథిని ప్రశంసించాడు. తనను నమ్మిన ఆంజనేయ స్వామి, జటాయువు, సుగ్రీవుడు, శబరి, ఉడుత, విభీషణుని వంటి ఎందరో భక్తులకు కరుణామృతాన్ని పంచాడు. అందుకే, ‘రామో విగ్రహవాన్ ధర్మః’! లోకానికే పురుషోత్తముడై ఆదర్శమూర్తిగా నిలిచినాడు.