న్యూఢిల్లీ, జూలై 27: వాహన ధరలను మరోసారి పెంచాలని ఆటోమొబైల్ సంస్థలు యోచిస్తున్నాయి. ఉత్పాదక వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ధరల పెంపు అనివార్యమన్న సంకేతాలను ఇస్తున్నాయి. స్టీల్ తదితర లోహాల ధరలు ప్రియమవడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండుసార్లు ఆయా సంస్థల కార్లు, టూవీలర్లు, ట్రక్కుల ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడోసారి పెంపు తప్పేట్లు లేదని టాటా మోటర్స్, బజాజ్ ఆటో వర్గాలు అంటున్నాయి. తయారీ ఖర్చులు తగ్గుముఖం పడుతాయని ఇన్నాళ్లూ వేచిచూశామని, కానీ లోహాల ధరలు పెరుగుతూపోతూనే ఉన్నాయని టాటా మోటర్స్ సీఎఫ్వో పీబీ బాలాజీ అన్నారు. ఈ నెలలో అన్ని వాణిజ్య వాహన ధరలను 1-2.5 శాతం మేర టాటా మోటర్స్ పెంచింది. ఏప్రిల్లో 2.5 శాతం పెంచిన సంగతి విదితమే. అయితే ప్యాసింజర్ వాహన ధరలను ఒక్కసారి మాత్రమే పెంచింది. మే నెలలో 1.8 శాతం పెరిగాయి. బజాజ్ ఆటో కూడా ధరల పెంపునకున్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నది. అయితే లాక్డౌన్ నేపథ్యంలో టూవీలర్ మార్కెట్లో నెలకొన్న స్తబ్ధత.. ధరల పెంపుపై పునరాలోచనలో పడేలా చేస్తున్నది.