30,00,000 కొలువులకు ముప్పు
ముంబై, జూన్ 16: ఐటీ ఉద్యోగులకు ఆటోమేషన్ షాకివ్వబోతున్నది. పలు పరిశ్రమల్లో, ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఆటోమేషన్ వేగవంతంకావడంతో దేశీ ఐటీ కంపెనీలు 2022 సంవత్సరానికల్లా 30 లక్షల ఉద్యోగుల్ని తొలగించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా బుధవారం విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. రొబొట్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ)ను అమలుచేయడం ద్వారా జీతభత్యాలకు, ఇతరాలకు వార్షికంగా చెల్లించే 10,000 కోట్ల డాలర్ల వరకూ కంపెనీలు ఆదా కానున్నదని ఆ నివేదిక పేర్కొంది. ప్రస్తు తం దేశీ ఐటీ రంగం 1.6 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నది. అందులో 90 లక్షల మంది తక్కువ నైపుణ్యత అవసరమైన సర్వీసులు, బీపీవోల్లో పనిచేస్తున్నట్లు నాస్కామ్ డాటా వెల్లడిస్తున్నది. ఇందులో 30 శాతం వరకూ (30 లక్షల మంది) 2022 కల్లా ఉద్యోగాలు కోల్పోతారని, 7 లక్షల ఉద్యోగాల్ని ఆర్పీఏ భర్తిచేస్తుందని, దేశీ ఐటీ కంపెనీలు చేపట్టనున్న టెక్నాలాజికల్ అప్గ్రేడ్స్, అప్స్కిల్లింగ్కారణంగా మిగతా ఉద్యోగాలకు కోత పడుతుందని, ఆర్పీఏ అప్స్కిల్లింగ్తో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ తదితర కంపెనీలు వచ్చేఏడాదికల్లా గణనీయంగా ఉద్యోగాల్ని తగ్గిస్తాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా తెలిపింది. ఒక్క అమెరికాలోనే 10 లక్షల ఉద్యోగాలు పోతాయని, అయితే అధిక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతూనే వుంటుందని నివేదిక పేర్కొంది.