శనిగ్రహం పుట్టినపుడు ఈశ్వరుడంతటివాడే ఎక్కడికో అడివిలోకి వెళ్లి మర్రిచెట్టు తొర్రలో దాక్కున్నాడట!మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఈశ్వరుడితో పోల్చడం లేదు కానీ, చేపలు, తాబేళ్లు లాంటి సాధుజీవులు నివసించే మంచినీటి కాసారాన్ని వదిలి మొసళ్లు, తిమింగలాలు, సొరచేపల్లాంటి క్రూరజీవుల ఆవాసం అయిన ఉప్పునీటి సముద్రంలో దూకినట్లు రాజకీయ జన్మనిచ్చి, పదవులు ఇచ్చి, గౌరవాన్ని ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీని, దాని అధినాయకుడు కేసీఆర్ను తూలనాడుతూ బీజేపీలో చేరబోతుండటం మాత్రం ఆయన గొయ్యిని ఆయనే తవ్వుకున్నట్లయింది.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి లేకపోయినప్పటికీ ఈటలకు కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ తొలి ఆర్థికమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఐదేండ్లు ఆయనను పదవి నుంచి కదిలించలేదు. ఈటల బడ్జెట్ ప్రవేశపెట్టినపుడల్లా సభాముఖంగా ఆయన్ను అభినందించారు కేసీఆర్. అలాంటి కేసీఆర్ను నియంతగా, ప్రగతిభవన్ను బానిసల భవనంగా ఈటల నిందలు మోపడం విడ్డూరం. పైగా గత ఐదేండ్లుగా కేసీఆర్తో చెడింది అని ఈటల చెప్పడం వింతగా ఉన్నది. అలాంటప్పుడు నాడే ఈటల రాజీనామా చేసి వెళ్లిపోయి ఉంటే ఆయన ప్రవచించే ఆత్మగౌరవానికి విలువ పెరిగేది.
సాధారణంగా ఒక పార్టీ నుంచి వెలివేయబడినవారు ఎవరైనా సరే, ముందుగా చేసే పని మీడియా ముందుకెళ్లి పార్టీ అధినేతను తీవ్ర పదజాలంతో విమర్శించడం. తర్వాత అనుచరులతో చర్చించి భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తానని మొక్కుబడిగా ఒక ప్రకటన చేయడం. ఈటల కూడా పదవి పోగానే కేసీఆర్ను దుమ్మెత్తి పోస్తాడని, చీల్చిచెండాడతాడని కొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆశించారు. గత ఏడేండ్లలో కేసీఆర్ వ్యక్తిగత పద్ధతులను ఒకసారి గమనిస్తే ఆయన ఎవరి మీదా రాజకీయ కక్ష సాధించిన దృష్టాంతం లేదు. రాజకీయ ప్రత్యర్థులను కూడా వేధించినట్లు, కేసులు పెట్టినట్లు వినలేదు. అందుకే విపక్ష నాయకులు కేసీఆర్ను నిర్భయంగా విమర్శిస్తారు. తప్పులు చేసిన చాలామందిని ఆయన క్షమించిన దాఖలాలే కనిపిస్తాయి. ఆయన ఉద్యమ నాయకుడు కావడంతో తన సాటివారి పట్ల కోపం వచ్చినా పగ సాధించినట్లు మనం వినలేదు.
ఈటల రాజీనామా చేయకుండా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. నాలుగు రోజులు సంప్రదింపులు, సమావేశాలు జరిగినా ఈటలకు నిర్దిష్టమైన హామీలు లభించలేదు. ఎలాంటి హామీలు లేకుండానే ఈటల బీజేపీలో చేరుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మొన్న ప్రకటించారు. కాపురం చేసే కళ కాలు పెట్టినరోజే తెలుస్తుందన్నట్లు ఈటలకు పార్టీలో చేరకముందే సరైన గౌరవం దక్కలేదని, అయన ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాల వద్ద సమర్పించి వచ్చారని తేలుతున్నది. టీఆర్ఎస్తో భవిష్యత్తులో సంబంధాలు పెట్టుకోకూడదని ఈటల విధించిన షరతులను ఢిల్లీ పెద్దలు ఆమోదించలేదట. ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి ఇంకా పూర్తి ఆధిక్యత లేదు. టీఆర్ఎస్కు రాజ్యసభలో ఆరుగురు సభ్యుల బలం ఉన్నది. గతంలో కొన్ని బిల్లుల విషయంలో టీఆర్ఎస్ తన మద్దతును బీజేపీకి ప్రకటించి ఉన్నది. మళ్లీ భవిష్యత్తులో టీఆర్ఎస్ అవసరం ఉండొ చ్చు. అందుకని ఆ విషయంపై ఢిల్లీ పెద్దలు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈటల నిరాశకు గురయ్యారని ఇక గత్యంతరం లేకనే బీజేపీలో చేరుతున్నారని సమాచారం.
ఇతర పార్టీల నుంచీ బీజేపీలో చేరిన డీకే అరుణ, జితేందర్రెడ్డి, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు లాంటి హేమాహేమీలకు ఏ మాత్రం గౌరవం దక్కిందో అందరికీ తెలుసు. ఏవో కొన్ని పార్టీ పదవులు ఇవ్వడం తప్ప అధికార పదవులు బీజేపీ ఇంతవరకు ఎవ్వరికీ కట్టబెట్టలేదు.
ఎవరేం అనుకున్నా ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సిన వాస్తవాలు కొన్ని ఉన్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఏదో టీడీపీ మీద కోపంతో పుట్టింది కాదు. దాని పుట్టుకే ఒక మహత్తర ఆశయంతో మొదలైంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం ఆ పార్టీ లక్ష్యం. గతంలో కొందరు నాయకులు ఇదే లక్ష్యంతో పార్టీలు పెట్టినా ఒక్కటి కూడా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాయి. కానీ కేసీఆర్ ఏ ముహూర్తంలో పార్టీని స్థాపించారో కానీ, తెలంగాణలోని ప్రతి వర్గాన్ని ఉత్తేజితులను చేయగలిగారు. నాలుగు కోట్లమందిలో నమ్మకం కలిగించగలిగారు. కేంద్రంతో, రాష్ట్రంతో ఘర్షణ పడ్డారు. కేసీఆర్ చిత్తశుద్ధి మీద ఎప్పుడైతే ప్రజలకు విశ్వాసం కలిగిందో అప్పుడే తెలంగాణ ఉద్యమం మహోధృతమైంది. కేసీఆర్ నిరాహారదీక్షతో అది పతాకస్థాయికి చేరింది. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టారనే నమ్మకం కలగగానే పార్టీలకు అతీతంగా జనం కేసీఆర్కు జేజేలు పలికారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఇక కేసీఆర్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఢిల్లీ వెళ్లి డజన్లకొద్దీ రాజకీయ పార్టీలతో మంతనాలు జరిపారు. ఆయన పోరాటపటిమ ఫలితంగా తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. ఒక లక్ష్యం కోసం ఉద్యమాన్ని ప్రారంభించి ఆ లక్ష్యాన్ని సాధించిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ అని దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బహిరంగంగా ప్రకటించారంటే కేసీఆర్ పోరాటం ధన్యమైనట్లే కదా!
అలాంటి నేపథ్యం ఉన్న కేసీఆర్ను ఎదిరించి మరొక పార్టీ కానీ, నాయకుడు కానీ నిలబడటం సాధ్యమేనా? కాదని ఎన్నోసార్లు రుజువైంది. కేసీఆర్ను ధిక్కరించి వెళ్లిన ఏ ఒక్క నాయకుడు కూడా వేరే పార్టీల్లో కానీ, సొంతంగా కానీ రాణించలేకపోయారు.
ఉద్యమంలో ప్రముఖ పాత్రను పోషించిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ సొంతంగా పార్టీలు పెట్టుకొని పోటీలు చేస్తే ఒక్కరికి కూడా డిపాజిట్ దక్కలేదంటే కేసీఆర్ ప్రభావం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు దేవేందర్ గౌడ్, పెద్దిరెడ్డి లాంటివారు కూడా సొంతపార్టీలు పెట్టుకున్నారు. ప్రయోజనం శూన్యం. ప్రముఖ నటి విజయశాంతి పార్టీ పెట్టినా ఆదరణ దక్కలేదు. కేసీఆర్ను వేరే కారణాలతో ఇష్టపడని సామాన్య పౌరులు కూడా ఇతరులు ఎవరైనా కేసీఆర్ను రాజకీయ ద్వేషాలతో విమర్శిస్తే ఏ మాత్రం సహించని వాతావరణం తెలంగాణలో నెలకొని ఉన్నది. ఎందుకంటే ప్రజల్లో కేసీఆర్ సాధించుకున్న ప్రతిష్ట అలాంటిది. ఇక్కడ ఒక్క విషయాన్ని తప్పకుండా ప్రస్తావించుకోవాలి.
ఆకాశంబున నుండి శంభుని శిరం,
బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి,
భూలోకంబు నందుండి య
స్తోకాంబోధి, పయోధి నుండి
పవనాంధోలోకమున్ జేరె గం
గా కూలంకష! పెక్కు భంగులు
వివేక భ్రష్ట సంపాతముల్
అన్న ఏనుగు లక్ష్మణ కవి పద్యం ఈటల విషయంలో చక్క గా సరిపోతుంది. ఒక మహోన్నత ఉద్య మం నుంచి పుట్టుకొచ్చి, తెలంగాణ జాతిపితగా ఖ్యాతినొందిన ఒక మహోన్నత నాయకుడి నీడలో పెరిగి, ఆయన చలవతో ఉన్నత పదవులను అలంకరించిన ఈటల చివరికి తన భవిష్యత్తును తానే సమాధి చేసుకోవడం విషాదం!
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు)
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఏదో టీడీపీ మీద కోపంతో పుట్టింది కాదు. దాని పుట్టుకే ఒక మహత్తర ఆశయంతో మొదలైంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం ఆ పార్టీ లక్ష్యం. గతంలో కొందరు నాయకులు ఇదే లక్ష్యంతో పార్టీలు పెట్టినా ఒక్కటి కూడా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాయి.
–ఇలపావులూరి మురళీ మోహనరావు