Auto Debit Rules | డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి జరిపే వివిధ రకాల రికరింగ్ ట్రాన్సాక్షన్స్ ((transactions) అంటే ఆటో డెబిట్ నిబంధనలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మారిపోనున్నాయి. ఖాతాదారుల భద్రత, పేమెంట్స్ సజావుగా సాగడం కోసం ఆర్బీఐ ఈ రూల్స్ను అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే సాగుతున్నాయి.
క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు, విద్యుత్, వాటర్, గ్యాస్ బిల్లులతోపాటు నెలవారీ రుణ వాయిదాలు, బీమా ప్రీమియంలు, మొబైల్ రీచార్జి, ఇంటర్నెట్ సర్వీసెస్ తదితర సేవల చార్జీలపేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. వీటి పేమెంట్స్ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లేదా ఇతర ప్రీ పేమెంట్స్ సర్వీసెస్ (పీపీఎస్) ద్వారా జరుగుతున్నాయి.
కానీ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ లావాదేవీలను జరుపడానికి ఖాతాదారుల నుంచి అడిషనల్ ఫ్యాక్టర్ అథంటికేషన్ (ఏఎఫ్ఏ) అంటే ధ్రువీకరణ పొందాలని ఆర్బీఐ ఇంతకుముందు తెలిపింది. కొత్త రూల్స్ ప్రకారం రూ.5000 దాటిన ప్రతి పేమెంట్కు వన్టైం పాస్వర్డ్ (ఓటీపీ) తప్పనిసరి చేసింది.
తొలుత ఈ నిబంధనను 2019 డిసెంబర్ 31 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు గడువు పొడిగించింది. దీని ప్రకారం గత ఏప్రిల్ నుంచి అమలులోకి రావాల్సి ఉంది.
అప్పటికీ బ్యాంకులు తమ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయకపోవడంతో గడువు పొడిగించాలని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) సూచించింది. దీంతో ఖాతాదారుల సౌకర్యార్థం ఆర్బీఐ మరో ఆరు నెలలు పొడిగించింది. తాజాగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని వెల్లడించింది. దీన్ని పాటించని వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.