ముంబై: రుణ వాయిదా (ఈఎంఐ)లు, వివిధ రకాల బిల్లుల చెల్లింపునకు సంబంధించిన ఆటో-డెబిట్ లావాదేవీలు వరుసగా రెండో నెలలో తిరస్కరణకు గురయ్యాయి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్) డేటా ప్రకారం గత నెలలో మొత్తం 85.7 మిలియన్ ఆటో డెబిట్ లావాదేవీలకు గాను 30.8 మిలియన్ల లావాదేవీలు తిరస్కరణకు గురయ్యాయి. ఇది మొత్తం లావాదేవీల్లో 35.91 శాతం.
అంతకుముందు ఏప్రిల్లో 85.4 మిలియన్ లావాదేవీలకు 29.08 మిలియన్లు తిరస్కరణకు లోనయ్యాయి. మహమ్మారితో క్రమంగా పెరిగిన ఆటో డెబిట్ లావాదేవీల తిరస్కరణ తగ్గి మార్చిలో సాధారణ స్థాయికి చేరింది.
కానీ కరోనా రెండో వేవ్ విజృంభణ, దాని కట్టడికి రాష్ట్రాలు విధించిన లాక్డౌన్ల వల్ల ప్రతికూల తిరస్కరణ రేట్లు పెరిగాయి. కరోనా కట్టడికి విధించిన కఠిన ఆంక్షలు, లాక్డౌన్ వంటి అంశాలు ప్రజల ఆదాయాలకు గండికొట్టడం తిరస్కరణకు ప్రధాన కారణమని తెలుస్తున్నది.
తత్ఫలితంగా ప్రజలు తమ ఖాతాల్లో సరిపడా సొమ్ము ఉంచలేకపోతున్నారు. ప్రజలు ఉపాధి, ఉద్యోగాలు కోల్పోవడంతో సరైన సమయంలో ఈఎంఐలు, ఇతర ఆర్థికపరమైన వ్యయాల్ని చెల్లించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి.