న్యూఢిల్లీ : ఐటీ రంగంలో టెకీలకు నెలకొన్న డిమాండ తరహాలో డిజిటల్ సేల్స్పై ఫోకస్ పెంచిన ఆటోమొబైల్ కంపెనీలు సైతం టెకీల నియామకానికి మొగ్గుచూపుతున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆటో దిగ్గజాలు వర్చువల్ సేల్స్కు ప్రాధాన్యత ఇస్తుండగా టెక్ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కోసం ఆయా కంపెనీలు అన్వేషిస్తున్నాయి. 2019లో కొవిడ్-19కు ముందున్న పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం ఆటోమోటివ్ పరిశ్రమలో ఐటీ, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ నైపుణ్యాలు కలిగిన సిబ్బంది హైరింగ్ ఏకంగా 45 శాతం పెరిగిందని మానవ వనరుల సంస్ధ టీమ్ లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది.
గత రెండేండ్లుగా కస్టమర్లు డిజిటల్ వేదికగా వాహనాల మదింపు, కొనుగోళ్లకు దిగుతుండటంతో ఆటోమొబైల్ కంపెనీలు, సరఫరాదారులు తమ కార్యకలాపాలను డిజిటలీకరించేందుకు సన్నద్ధమయ్యాయి. కస్టమర్లకు సౌకర్యంగా ఉండటంతో పాటు సమర్ధంగా సేవలందించేందుకు వర్చువల్ సేల్స్ను పెంచడంపై కంపెనీలు దృష్టిసారించాయి. తమ డీలర్ నెట్వర్క్ను డిజిటల్కు మార్చడం దగ్గర నుంచి కస్టమర్ వాహన కొనుగోలు ప్రక్రియను రీడిజైన్ చేయడం, డీలర్ సమర్ధంగా డిజిటల్ వనరులను వాడుకునేలా చూడటం వంటి చర్యలను వేగవంతం చేశారు.
దీంతో డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ సేవలు వంటి విభాగాల్లో టెకీల నియామకం ఊపందుకుంది. ప్రస్తుత క్వార్టర్లో ఆటోమోటివ్ సెగ్మెంట్లో 18,000 టెక్ ఉద్యోగాలకు డిమాండ్ నెలకొందని టీమ్లీజ్ డిజిటల్ ఏవీపీ మునిరా లోలివాలా వెల్లడించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం చివరినాటికి ఆటోమోటివ్ రంగంలో 25,000 మంది టెక్ నిపుణులకు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. సేల్స్, మార్కెటింగ్ విధుల్లో డేటా అనలిటిక్స్ నేపధ్యం ఉన్న నిపుణుల హైరింగ్ను పెద్దసంఖ్యలో చేపడతామని ప్రముఖ కార్లతయారీ సంస్ధలు ఇప్పటికే వెల్లడించాయి.