Audi on Import Duty | దిగుమతి చేసుకున్న కార్లపై అధిక సుంకాల పట్ల కార్ల తయారీ సంస్థలు స్పందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ సెగ్మెంట్ వృద్ధి సాధించడానికి అధిక దిగుమతి సుంకం అవరోధంగా మారుతుందని జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఆందోళన వ్యక్తం చేసింది. దిగుమతి సుంకం విధించడంలో కొన్ని నిబంధనల్లో సడలింపు వచ్చినా మరికొన్ని వాహనాలను విక్రయించడానికి సాయం చేసినట్లవుతుందని పేర్కొంది. దాంతోపాటు దేశీయంగా ఆయా మోడళ్ల ఉత్పత్తికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెసులుబాటు లభిస్తుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 100 శాతం దిగుమతి సుంకం భారత్ మార్కెట్కు ప్రధాన అవరోధంగా ఉందన్నారు.
ప్రస్తుతం ఆడి ఇండియా దేశంలో ఐదు ఎలక్ట్రిక్ మోడల్ కార్లను విక్రయిస్తోంది. దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల దిగుమతి కార్ల ధర తగ్గుముఖం పడుతుందని ఆడీ ఇండియా పేర్కొంది. యావత్ భారత్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి సిద్ధంగా ఉందని బల్బీర్ సింగ్ ధిల్లాన్ చెప్పారు. ఇప్పటికే ఈ-ట్రాన్ తొలి సెట్ కార్ల విక్రయం పూర్తయిందన్నారు. గతవారం రెండు కొత్త పూర్తి ఎలక్ట్రిక్ ఫోర్ డూర్ కూప్స్ ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రోన్ జీటీ జత కలిశాయన్నారు.
ఇంతకుముందు గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తొలిసారి భారత్లో దిగుమతి కార్లపై సుంకాలు ప్రపంచంలోకెల్లా ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కార్లపై దిగుమతి సుంకాల్లో మినహాయింపు ఇవ్వాలని కోరారు. కానీ దేశీయంగా ఉత్పత్తి ప్రారంభిస్తేనే దిగుమతి సుంకాలు తగ్గిస్తామని టెస్లాకు కేంద్రం తెగేసి చెప్పింది.
టెస్లా తర్వాత దిగుమతి కార్లపై అధిక సుంకాలపైన మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ స్పందించింది. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల మార్కెట్లతో పోలిస్తే భారత్లో కార్ల ధరలు రెట్టింపు ఉన్నాయని మెర్సిడెస్ బెంజ్ ఎండీ మార్టిన్ స్కెవెంక్ ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి భారత్లో దిగుమతి సుంకాలు చాలా ఎక్కువగా ఉండటమే కారణమని పేర్కొన్నారు. తక్షణం దిగుమతి సుంకాలు తగ్గిస్తే నూతన కార్ల డెవలప్మెంట్కు, గ్లోబల్ టెక్నాలజీలను అందుబాటులోకి తేవడానికి వీలు కలుగుతుందని చెప్పారు.