బీడీఎల్, ఎంబీడీఏ మధ్య ఒప్పందం
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): భారత్లో అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్టు ఎయిర్ మిస్సైల్స్(ఏఎస్ఆర్ఏఏఎం, అస్రామ్) తయారీ కోసం ప్రభుత్వ రంగ సంస్థ భారత డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్), యురోపియన్ మిస్సైల్ కంపెనీ ఎంబీడీఏల మధ్య ఒక లైసెన్సింగ్ ఒప్పందం కుదిరింది. ఒప్పందం మేరకు మిస్సైల్స్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్, అసెంబ్లింగ్ చేసేందుకు హైదరాబాద్ సమీపంలోని భానూర్ వద్ద ఒక యూనిట్ను ఏర్పాటుచేస్తారు. మంగళవారం వర్చువల్గా జరిగిన ఓ కార్యక్రమంలో బీడీఎల్ సీఎండీ సిద్దార్థ మిశ్రా సమక్షంలో బీడీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఎన్పీ దివాకర్, ఎంబీడీఏ ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ కో-ఆపరేషన్ డైరెక్టర్ జార్జ్ కైరియాకైడ్స్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
2022-23 నుంచి తయారీ
లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం ఏఎస్ఆర్ఏఏఎంల తయారీ సదుపాయం ఏర్పాటుకు సంబంధించిన పరికరాలు, సాంకేతిక నైపుణ్యాన్ని బీడీఎల్కు ఎంబీడీఏ బదిలీ చేస్తుంది. 2022-23 ఏడాది నుంచి ఈ సదుపాయంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు బీడీఎల్ సీఎండీ మిశ్రా తెలిపారు. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ కార్యక్రమాల అమలు పట్ల బీడీఎల్ కట్టుబాటుకు ఈ మిస్సైల్స్ తయారీ ఒప్పందం సంకేతమని ఆయన చెప్పారు. ‘విత్ఇన్ విజువల్ రేంజ్’ మిస్సైల్ అయిన ‘అస్రామ్’ను భానూర్ యూనిట్లో బీడీఎల్ తయారుచేస్తుంది. భవిష్యత్తులో వీటిని ఎంబీడీఏ ద్వారా ఎగుమతి చేస్తారు. ఇండియాలో కొత్తగా ‘అస్రామ్’ తయారీ సదుపాయాన్ని ఏర్పాటుచేయడం పట్ల ఎంబీడీఏ డైరెక్టర్ జార్జ్ కైరియాకైడ్స్ సంతోషం వ్యక్తంచేస్తూ తాము డిజైన్ చేసిన ‘మిలన్’ మిస్సైల్స్ను పెద్ద సంఖ్యలో బీడీఎల్ తయారుచేసిందన్నారు.