సూర్యాపేట : శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరితరం కాదని, నీళ్లున్నంత వరకు విద్యుదుత్పత్తి చేసి తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలో ఏపీ ప్రభుత్వం తీర్మానిస్తుందా.? అని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ఉన్నది సీఎం కేసీఆర్ సర్కార్ అన్నది ఏపీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తీర్మానంపై మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం తీవ్రంగా స్పందించారు.
విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ హక్కు అని అపమనే హక్కు ఏ కమిటీకి, కమిషన్కు లేదని అన్నారు. పాత పద్ధతిలోనే అరాచకాలు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటా ఎంతో మాకు స్పష్టంగా తెలుసు. మా వాటలో ప్రతి నీటి బొట్టును ఎలా వాడుకోవాలో సీఎం కేసీఆర్కు బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుని గతంలో చేసిన తప్పులనే ఏపీ ప్రభుత్వం తిరిగి చేస్తున్నదని ఆరోపించారు. ఎవరో ఆర్డర్లు వేస్తే వినాల్సిన ఆవశ్యకత తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నారు.
మూడోవ్యక్తి అవసరమే లేకుండా ఇద్దరమే కూర్చుని మాట్లాడుకుందాం అని ముందుగా చెప్పిందే ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తుచేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముమ్మాటికి అక్రమమేనని, దుర్మార్గంగా పోతిరెడ్డిపాడు ను వెడల్పు చేసి ప్రయత్నంలో నిజం లేదా అని ఆయన ఏపీ సర్కార్ను నిలదీశారు. రాజకీయ చతురతతో ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా ఉన్న సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప వ్యవధిలో తేల్చిపడేశారని, తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సులభతరమైందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలపైనే అక్కడి ప్రభుత్వానికి సోయిలేదని అక్కడాయన ఇక్కడి ప్రజలకు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణకు అతిథులు అని వారి బాగోగులు ఎలా చేసుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలిసినంతగా మరొకరికి తెలియదన్నారు. సమావేశంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.