హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): ఆటోమోటివ్ రంగంలో దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) సంస్థ తెలంగాణలో ప్రీ సర్టిఫికేషన్ ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ మథాయ్ తెలిపారు. మథాయ్ నేతృత్వంలోని ఏఆర్ఏఐ బృందం రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, ఈవీ, ఈఎస్ఎస్ డైరెక్టర్ సుజయ్ కారంపురితోపాటు ఇతర అధికారులతో ఆ బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో ఆటోమోటివ్ రంగంలోని ఎకోసిస్టం గురించి సుజయ్ వారికి వివరించారు. టీ-వర్క్స్తోపాటు రాయదుర్గ్లో దేశంలోనే అతి పెద్ద ప్రోటోటైపింగ్ ల్యాబ్ ఉన్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్, ఏఆర్ఏఐలు గత ఏడాది అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ క్రమంలోనే ఏఆర్ఏఐ కోసం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో రావిర్యాలలో ఇంక్యుబేషన్ కేంద్రాన్ని అభివృద్ధి చేయడంతోపాటు ఈ-సిటీలో ఏఆర్ఏఐ ప్రీ సర్టిఫికేషన్ అండ్ ట్రైనింగ్ ల్యాబ్ కోసం స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు.