న్యూఢిల్లీ : ఏప్రిల్ లో కూరగాయలు, ఆహారోత్పత్తుల ధరలు కొంతమేర తగ్గినా వంట నూనెల ధరలు మాత్రం సలసలా మండాయి. వంటనూనెల ధరలు ఏప్రిల్ లో ఏకంగా 26 శాతం ఎగబాకగా, మాంసం, చేపల ధరలు 16.68 శాతం పెరిగాయి. ఇక కూరగాయలు, ఆహారోత్పత్తుల ధరలు దిగిరావడంతో ఏప్రిల్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.29 శాతానికి తగ్గింది.
మార్చిలో 4.87 శాతంగా నమోదైన వినిమయ ఆహార ధరల సూచీ ద్రవ్యోల్బణం 2.02 శాతం తగ్గిందని జాతీయ గణాంక కార్యాలయం డేటా వెల్లడించింది. కూరగాయలు, చిరుధాన్యాలు, ఇతర ఆహారోత్పత్తుల ధరలు తగ్గడంతో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. మరోవైపు మార్చిలో పారిశ్రామికోత్పత్తి సూచీ 22.4 శాతం పెరగడం ఊరట కలిగిస్తోంది.