శాన్ఫ్రాన్సిస్కో: అంతర్జాతీయంగా నెలకొన్న చిప్ల కొరత తమ ఐఫోన్ల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందని టెక్ జెయింట్ ఆపిల్ ఆందోళన వ్యక్తం చేసింది. రెవెన్యూ గ్రోత్ కూడా నెమ్మదిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేస్తుందని తెలిపింది. కానీ ఇటీవలే ముగిసిన మూడో త్రైమాసికంలో రెవెన్యూ గ్రోత్ రేట్ 36.4 శాతానికి తక్కువగా నమోదైందని వెల్లడించింది.
మూడో త్రైమాసికంలో ఐఫోన్ల తయారీపై చిప్ల కొరత ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రభావం చూపిందని, నాలుగో త్రైమాసికానికి దారుణంగా మారుతుందని పేర్కొంది. చిప్ల కొరత నుంచి బయట పడేందుకు పాత టెక్నాలజీ సాయంతో ఫోన్లు తయారు చేస్తున్నట్లు ఆపిల్ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. కానీ ఐఫోన్ల తయారీలో అవి కీలకం అని వెల్లడించారు.
నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ మోడళ్లను తయారు చేయడానికి ఆపిల్ భారీగా చిప్లను నిల్వ చేసి ఉంటుందని భావిస్తున్నట్లు అనలిస్టులు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో చిప్ల కొరతకు పలు కారణాలు ఉన్నాయన్నారు.
కరోనాను నియంత్రించడానికి ప్రపంచ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్లు… దీంతో ఫ్యాక్టరీలు మూసివేయడం ఒక కారణం అని అనలిస్టులు అంటున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా వర్క్ ఫ్రం హోం, లెర్నింగ్ ఫ్రం హోం కల్చర్ పెరగడంతో కన్జూమర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ డిమాండ్ పెరగడమూ మరో కారణం.
మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలోని పలు సంస్థలు వివిధ రకాల సెమీ కండక్టర్లు, చిప్ల సేకరణ కోసం పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 4జీ లేదా 5జీ చిప్సెట్లతోపాటు పవర్ మేనేజ్మెంట్ చిప్లు, డిస్ప్లే డ్రైవర్లు, అప్లికేషన్ సెమీ కండక్టర్ల సేకరణకు ఇబ్బందుల పాలవుతున్నారు.