ప్రతి మనిషి పుట్టుకతోనే దేవ, పితృ, ఋషి ఋణాలను కలిగి ఉంటాడు. మొదటిదైన ‘దేవఋణం’ యజ్ఞయాగాదులు, అర్చన, ఆరాధనాది విధులద్వారా తీర్చుకోగలం. సంతానం, వంశప్రతిష్ఠలను పెంచే సత్కార్యాలు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల హితోపదేశాలను పాటించడం, దివంగత పెద్దలకోసం శ్రద్ధతో శ్రాద్ధకర్మలు చేయడం.. వంటివన్నీ ‘పితృ (మాతా పితరుల) ఋణం’ తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి. వేదవిజ్ఞానం, రామాయణ, మహాభారత ఇతిహాసాలు, భాగవత, భగవద్గీతాది మహాగ్రంథాలతో సహా పురాణ వాఙ్మయాన్నంతా భక్తితో అధ్యయనం చేయడం ద్వారా ‘ఋషిఋణం’ తీర్చుకొనే అవకాశం మనకుంది. ‘మహర్షులు అందించిన విజ్ఞాన సంపదను తాను పొందుతూ, పర్యావరణ పరిరక్షణకు, పశుపక్ష్యాదులు, జీవకోటితోపాటు తోటివారి శ్రేయస్సు కోసమూ దానిని ఉపయోగించగల శక్తి సామర్థ్యాలను వివేకవంతుడైన మానవుడు కలిగి ఉన్నాడు.
మానవులలోని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును ప్రకాశింప చేయడానికే వేలవేల సంవత్సరాల క్రితమే మహర్షులు ‘అపారమైన విజ్ఞాన సంపద’ను సిద్ధపరిచి ఇచ్చారు. ప్రజలు తెలుసుకోలేని అపౌరుషేయమైన వేదవిజ్ఞానాన్ని, అతీంద్రియ విషయాలను ఎన్నింటినో తమ తపశ్శక్తి ప్రభావంతో ప్రత్యక్షంగా దర్శించి మనకు అందించిన మహోపకారులే మహర్షులు. ‘మంత్రద్రష్టారో ఋషయః’ అంటే, ‘వేదమంత్రాలను దర్శించినవారు ఋషులు’. నిరుక్తకారుడైన యాస్కాచార్యుడు, ‘ఋషిః దర్శనాత్. విశ్వ విజ్ఞానప్రదమైన వేదవిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా దర్శించే మహనీయుడే ఋషి’ అని నిర్వచించాడు. ధర్మశాస్త్ర కల్పసూత్రాల లాక్షణిక గ్రంథాలను ఇతిహాస పురాణాలను, సంగీత, నాట్య, శిల్ప, ఆయుర్వేదాది విద్యలను, తర్క, వ్యాకరణ, మీమాంసాది శాస్ర్తాలను మన క్షేమలాభాల కోసమే ఋషులు అందించారు.
ప్రియ ప్రాయా వృత్తిః వినయ మధురో వాచినియమః
ప్రకృత్యా కళ్యాణీ మతిః అనవగీతః పరిచయః
పురోవా పశ్చాద్వా తదిద మవి పర్యాసిత రసం
రహస్యం సాధూనాం అనుపథి విశుద్ధం విజయతే॥
-భవభూతి మహాకవి (‘ఉత్తర రామచరిత’ నాటకం)
‘పొంగి ప్రవహించే ప్రేమ, ప్రకృతి-ప్రాణులను ప్రేమించే నడవడిక, వినయశీలత, మధురమైన వాక్కు, లోకహితం- మంగళకరమైన ఆలోచనలు, రాగద్వేషాలకు అతీతమైన మనస్తత్వం.. మొత్తంగా దోషాలు అంటని జీవితాలను మహర్షులు సహజ స్థిరసంపదగా కలిగి ఉంటారు’. ఇదీ ఋషుల వ్యక్తిత్వం, గొప్పతనం. ఇంతేకాదు, లౌకిక సుఖభోగాలపై వైరాగ్యం, సడలని తపస్సు, దృఢమైన మనస్సు, జీవుల క్షేమాన్ని కోరే స్వభావం, అహింసా భావన, ఆడంబరాలు లేని జీవన విధానం, భగవద్ భక్తి, ఆదర్శప్రాయమైన సత్కార్యాచరణ, శీతోష్ణ ప్రతిబంధకాలను సహించగల శక్తి, ఆశలు లేని- ఆకర్షణలకు లొంగని ఇంద్రియ నిగ్రహం.. వంటి గుణాలెన్నో మూర్తీభవించిన వారు మహర్షులు. వారు మనకు అందించిన ఆధ్యాత్మిక, ధార్మిక విజ్ఞానాన్ని లోతుగా అధ్యయనం చేసి, ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఋషుల చరిత్రను ఆసాంతం తెలుసుకోవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపైనా ఉన్నది.
మానవుల సమగ్ర వికాసానికి దోహదపడే, మానవత్వాన్ని వికసింపజేసే, జీవితానికి పరమార్థాన్ని, కర్తవ్యాన్ని ప్రబోధించే శ్రీరామాయణ, మహాభారత, భాగవతాది మహాగ్రంథాలను వాల్మీకి- వ్యాసాది మహర్షులు అందించారు. మానవజాతికి అవి సుఖశాంతులను అందించే కాంతి కిరణాలు. సాంసారిక తాపత్రయాన్ని తొలగించే తాత్తికమైన మలయ మారుతాలు. సంకుచిత స్వభావం, ఆత్మన్యూనతతో సతమతమయ్యేవారికి, సుఖశాంతి సంతోషాలు మృగ్యమైనవారికి విజ్ఞానదీపికలుగా, హస్తభూషణాలుగా, హృదయాభరణాలుగా వెలుగొందే అమృతరస ఖండాలే ఆ మహాగ్రంథాలు. వీటి సమగ్ర అధ్యయనానికి మానవాళి ఇప్పటికైనా కృషి చేయవలసి వుంది. ఆర్షవాఙ్మయంలోని అనర్ఘ రత్నాలన్నిటినీ శోధించి, ఆ జ్ఞానసంపదను పూర్తి స్థాయిలో వెలికి తీసి, ఆచరణలోకి తెచ్చుకోగలిగితే మన జీవితాలు చరితార్థమవుతాయి.
-సముద్రాల శఠగోపాచార్యులు
98483 73067