హైదరాబాద్, ఆగస్టు 16: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ యూజర్ డెవలప్మెంట్ ఛార్జీలను (యూడీఎఫ్) పెంచాలని జీఎమ్మార్ గ్రూప్ ప్రతిపాదించింది. ఈ మేరకు జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ)కి ఒక ప్రతిపాదనను సమర్పించింది. దేశీ విమానాల్లో ప్రయాణించేవారి నుంచి వసూలుచేసే యూడీఎఫ్ను ప్రస్తుత రూ.281 నుంచి రూ.608కి, అంతర్జాతీయ ప్రయాణీకుల యూడీఎఫ్ను రూ.393 నుంచి రూ.1,300కు పెంచాలన్న ప్రతిపాదనపై భాగస్వాముల స్పందనను జీఎమ్మార్ కోరింది. 2025-26 సంవత్సరానికల్లా దేశీ యూజర్ ఛార్జీలను రూ.728కి, అంతర్జాతీయ ఛార్జీలను రూ.2,200కు క్రమేపీ పెంచాలన్న ప్రతిపాదనను జీఎమ్మార్ చేసింది. కాగా, కొవిడ్ కారణంగా విమానయాన కంపెనీల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నందున, యూజర్ ఛార్జీల పెంపును అనుమతించవద్దంటూ ఏఈఆర్ఏను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ కోరింది.