న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఇండియాలో వ్యాపారం కొనసాగించేందుకు అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్కు లీగల్ వ్యయాలు భారీగా అయ్యాయి. 2018-20 మధ్యకాలంలో రూ.8,546 కోట్లు (1.2 బిలియన్ డాలర్లు) లీగల్ ఖర్చులయ్యాయని అమెజాన్ తన పబ్లిక్ ఖాతాల్లో వెల్లడించింది. ఇండియాలోని అమెజాన్ 2018-19లో రూ.3,420 కోట్లు, 2019-20లో రూ.5,126 కోట్ల చొప్పున లీగల్ ఫీజుగా చెల్లించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్ గ్రూప్ టేకోవర్ వివాదంపై అమెజాన్ ప్రస్తుతం కోర్టుల్లో పోరు జరుపుతుండగా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుంచి ఒక దర్యాప్తును ఎదుర్కొంటున్నది.
లీగల్ ఖర్చులపై వ్యాఖ్యానించేందుకు అమెజాన్ నిరాకరిస్తుండగా, అమెజాన్ తన ఆదాయంలో 20 శాతం న్యాయవాదులకే ఖర్చుచేయడం ప్రశ్నార్థకమని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ విమర్శించింది. దేశంలో లంచాలివ్వడానికే అమెజాన్, దాని సబ్సిడరీలు వాటి ఆర్థిక వనరుల్ని వినియోగిస్తున్నాయడానికి భారీ లీగల్ వ్యయాలే నిదర్శనమని సీఏఐటీ జాతీయ కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ఆరోపించారు. ఆయన కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్కు ఒక లేఖరాస్తూ అమెజాన్ లీగల్ వ్యయాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.