హైదరాబాద్, జూలై 15: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. రాష్ట్రంలో మరో కొత్త గిడ్డంగిని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 11 కొత్త గిడ్డంగులతోపాటు ఇప్పటికే ఉన్న 9 గిడ్డంగులను విస్తరిస్తున్నామని గురువారం సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల్లో ఈ కొత్త గిడ్డంగుల ఏర్పాటు, పాత గిడ్డంగుల విస్తరణ ఉందని స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్లైన్ సేల్స్కు ఆదరణ పెరిగిన దృష్ట్యా నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచాలని అమెజాన్ నిర్ణయించింది. కాగా, త్వరలో రాబోయే ప్రైమ్ డే 2021కు ముందే కొన్ని కొత్త గిడ్డంగులను ప్రారంభిస్తామని అమెజాన్ ఈ సందర్భంగా తెలిపింది. పండుగ సీజన్కు ముందే అన్నీ అందుబాటులోకి వస్తాయన్నది.