ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ప్రైమ్( Amazon Prime ) మెంబర్షిప్ ఫీజును భారీగా పెంచేసింది. వార్షిక సభ్యత్వం ఫీజు 50 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ రూ.999గా ఉన్న ఈ మొత్తం ఇక నుంచి రూ.1499 కానుంది. నెలవారీ, మూడు నెలల ప్లాన్స్కు సంబంధించిన ఫీజులను కూడా అమెజాన్ మార్చింది. ఈ కొత్త రేట్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో కచ్చితమైన తేదీ ఇవ్వలేదు కానీ అతి త్వరలోనే అని మాత్రం చెప్పింది.
నిజానికి ఇండియాలో నెట్ఫ్లిక్స్, ఫ్లిప్కార్ట్, ఆపిల్ వంటి స్ట్రీమింగ్, ఈ-కామర్స్ సంస్థలతో పోలిస్తే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఫీజు చాలా తక్కువ. పైగా ఈ ఒక్క మెంబర్షిప్తో అమెజాన్ ఈ-కామర్స్ సైట్లలో స్పెషల్ ఆఫర్లతోపాటు ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, కిండిల్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇప్పుడా ఫీజును 50 శాతం పెంచేయడం చాలా మంది యూజర్లకు మింగుడుపడనిదే. ఫీజులను పెంచుతున్నట్లు అమెజాన్ తన వెబ్సైట్లో ప్రకటించింది.
మూడు నెలల సబ్స్క్రిప్షన్ను ఇన్నాళ్లూ రూ.329 వసూలు చేస్తుండగా.. ఇప్పుడది రూ.459కి.. నెలవారీ ఫీజు రూ.129 నుంచి రూ.179కి పెంచింది. ఇప్పటికే సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లు అది ముగిసే వరకూ అన్ని ప్రయోజనాలు అలాగే పొందవచ్చు. ముగిసిన తర్వాత మాత్రం ఈ కొత్త రేట్లను చెల్లించాల్సిందే. రేట్లను ఎందుకు పెంచిందో మాత్రం ఆ సంస్థ చెప్పలేదు.