న్యూయార్క్: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల నకిలీ లిస్టింగ్లను బ్లాక్ చేసింది ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్. కొంతకాలంగా యూజర్లు, బ్రాండ్లు, చట్టసభల ప్రతినిధుల నుంచి ఫిర్యాదులు రావడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ సోమవారం వెల్లడించింది. ఈ నకిలీ లిస్టింగ్స్ను అమ్మకముందే బ్లాక్ చేసినట్లు తెలిపింది. 2019లో కొత్త టూల్స్, టెక్నాలజీని తీసుకొచ్చినట్లు ప్రకటించిన తర్వాత తమ సైట్లో నకిలీ వస్తువుల అమ్మకాలపై అమెజాన్ దృష్టి సారించింది. కరోనా మహమ్మారి కారణంగా ఆన్లైన్ షాపింగ్ పెరగడంతో అదే స్థాయిలో కస్టమర్లను దోచుకోవడానికి ఆన్లైన్ స్కామర్లు ప్రయత్నించారని అమెజాన్ చెప్పింది.
ఇలాంటి నకిలీ వస్తువుల వల్ల కంపెనీ ప్రతిష్ట దెబ్బతింటుందన్న ఉద్దేశంతో రెండేళ్లుగా వీటిపై ఉక్కుపాదం మోపుతోంది. తమ బ్రాండ్ల పేరుతో నకిలీ వస్తువులు అమ్ముతున్నారని తెలిస్తే.. ఆ బ్రాండ్లు అమెజాన్లో అమ్మడం ఆపేయవచ్చు. ఇటు కస్టమర్లకు కూడా అమెజాన్పై విశ్వాసం సన్నగిల్లుతుంది. దీంతో అమెజాన్ వీటిని తొలగించింది. గతేడాది తమ వేర్హౌజ్లకు వచ్చిన సుమారు 20 లక్షల నకిలీ వస్తువులను కూడా అమెజాన్ ధ్వంసం చేసింది.