తిరుమలగిరి, ఏప్రిల్16: రైతులు పండించిన వరి ధాన్యా న్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. నియోజకవర్గ వ్యాప్తంగా 70 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో ముమ్మరంగా కొనుగోళ్లు సాగుతున్నాయి. గ్రామాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతులకు రవాణా ఇబ్బందులు తప్పాయి.
పెరిగిన సాగు విస్తీర్ణం
నియోజక వర్గంలోని అన్ని మండలాలకు కాళేశ్వరం జలాలు అందడంతో యాసంగిలో అధికంగా వరి సాగైంది. కాల్వల ద్వారా గోదావరి జలాలు అందించడంతో యాసంగిలో వానకాలం సాగును మించింది. ఈ సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 79,523 ఎకరాల్లో వరిసాగు చేశారు. తిరుమలగిరి మండలంలో 11,352 ఎకరాలు, నాగారం 15,290, జాజిరెడ్డిగూడెం 16,365, తుంగతుర్తిలో 18,744, మద్దిరాలలో 10,092, నూతనకల్ మండలంలో 7,680 ఎకరాల్లో వరి సాగైంది. వరికోతలు ముమ్మరంగా సాగుతుండగా రైతులు తాము కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు.
ముమ్మరంగా ..
తుంగతుర్తి నియోజక వర్గంలో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో 70 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తిరుమలగిరి మండలంలో 13, నాగారంలో 11, అర్వపల్లిలో 11, తుంగతుర్తిలో 16, నూతనకల్లో 11, మద్దిరాలలో 13 ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో చాలా వరకు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం సైతం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా కష్టాల్లో సైతం మద్దతు ధర క్వింటాకు రూ . 1,888 అందించి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. రైతుల వద్ద ఉన్న మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
ఇవీ కూడా చదవండీ…
టీకా వేసుకుందాం.. కరోనాను తరిమేద్దాం