హైదరాబాద్, మే 22: ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. మార్చితో ముగిసిన మూడునెలల కాలానికిగాను సంస్థ రూ.189 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.137 కోట్ల లాభంతో పోలిస్తే 38 శాతం అధికం. 2019-20 నాలుగో త్రైమాసికంలో రూ.1,581 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికి రూ.2,103 కోట్లకు ఎగబాకినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గతేడాది మొత్తానికి రూ.7,150 కోట్ల ఆదాయంపై రూ.647 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఉద్యోగుల చూపిన చొరవ వల్లనే ఆదాయ, లాభాల్లో వృద్ధిని సాధించినట్లు అమర రాజా బ్యాటరీస్ వైస్ చైర్మన్, ఎండీ జయదేవ్ గల్లా తెలిపారు. మరోవైపు గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.6 లేదా 600 శాతం తుది డివిడెండ్ను బోర్డు ప్రతిపాదించింది.