పూర్తిస్థాయిలో బస్సు సర్వీసులు
పెరుగుతున్న సంస్థ ఆదాయం
తొమ్మిది రోజుల్లో రూ.7.46 కోట్లు
కార్గో పార్సిల్కూ ఆదరణ
వరంగల్ రీజియన్ పరిధిలో 2.43 లక్షల పార్సిళ్లు.. రూ. 2.33 కోట్ల ఆదాయం
హన్మకొండ చౌరస్తా, జూలై 1: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టడంతో ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. లాక్డౌన్ సడలింపులో అంతంత మాత్రాన నడిచిన సర్వీసులు ప్రస్తుతం పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను కూడా పునరుద్ధరించారు. దీంతో సంస్థ ఆదాయమూ పుంజుకున్నది. వరంగల్ ఆర్టీసీ రీజియన్కు ఈ నెల 20 నుంచి 29 వరకు రూ. 7.46 కోట్ల ఆదాయం సమకూరింది. రైళ్లు లేకపోవడంతో హైదరాబాద్కు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వరంగల్-1, వరంగల్-2, హన్మకొండ, జనగామ, నర్సంపేట, పరకాల, తొర్రూరు, భూపాలపల్లి, మహబూబాబాద్ డిపోల్లో ప్రయాణికుల తాకిడి పెరిగింది. రద్దీ ఉన్న రూట్లలో అదనపు సర్వీసులను తిప్పుతున్నారు.
పార్సిల్ సర్వీసులతో మంచి ఆదాయం
నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని కార్గో పార్సిల్ సర్వీసు లాభాల బాటలో తీసుకువస్తోంది. గత సంవత్సరం జూన్ 19న ప్రారంభించగా, రీజియన్లో 11 కేంద్రాలతోపాటు 67 ప్రైవేట్ ఏజెంట్ల భాగస్వామ్యంతో సేవలు అందిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 29 వరకు 2.43 లక్షల పార్సిళ్లు, కవర్ల బుకింగ్ ద్వారా రూ.2.33 కోట్ల ఆదాయం వచ్చింది. రోజూ 800 నుంచి వెయ్యి వరకు పార్సిల్స్, కవర్లను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ రూ.85 వేల నుంచి రూ.95 వేల వరకు ఆర్టీసీ ఆదాయం ఆర్జిస్తోంది. 4 కార్గో వాహనాల ద్వారా గతేడాది నుంచి జూన్ 18 వరకు సరుకు రవాణా ద్వారా రూ.11 లక్షల ఆదాయం అదనంగా వచ్చింది.