హుజూరాబాద్: ‘హుజూరాబాద్ నియోజకవర్గానికి నీవు పోయినందుకు ఓ దరిద్రం పోయిందనుకుంటున్నాం.. ఈనాటికి దేవుడికి మా మొర ముట్టింది. మా గోస తెలిసింది కనుకనే నీకు తగిన శాస్తి జరిగిందని భావిస్తున్నాం’ అని ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పింగిళి ప్రదీప్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుమార్లు ఉన్నతమైన మంత్రి పదవులు సీఎం కేసీఆర్ ఇస్తే, టీఆర్ఎస్లో తనకు గౌరవం లేదని పదేపదే అనడం హాస్యాస్పదంగా ఉన్నదని మండిపడ్డారు. పదవులను అనుభవిస్తూ ప్రభు త్వ సొమ్ము తినడమే కాకుండా తన వియ్యంకుడికి, ఇతర బంధువులకు అప్పనంగా దోచి పెట్టారని ఆరోపించారు. పదవీవిరమణ చేసిన ఆయన వియ్యంకుడు వెంకట్రాంరెడ్డి కోసం ఒక ఐఏఎస్ హోదా ఉండాల్సిన హార్టికల్చర్ సెక్రటరీ బాధ్యతలను కేవలం తన స్వార్థంకోసం కట్టబెట్టింది నిజం కాదా? అన్నారు. ఇక ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నదో చెప్పాలని నిలదీశారు.
ఈటల కోసం తాము చాయ్, బిస్కట్లు తింటూ పనిచేస్తే పార్టీతో వచ్చిన పదవులు అనుభవిస్తూ తమను కనీసం మనుషులుగా ఏనాడైనా చూశావా? అని మండిపడ్డారు. ఈటల రాజేందర్ వల్ల ఎంతమందికి అన్యాయం జరిగిందో అందరికీ తెలుసని, వాళ్లు కూడా బయటకి వచ్చే రోజులు ముందున్నాయన్నారు. ఇంకా నియోజకవర్గ ప్రజలను మోసం చేద్దామని చూడొద్దని హితవుపలికారు. తాము ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నడుస్తామని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టంచేశారు. సమావేశంలో శనిగరం సర్పంచ్ పింగళి రవళి, చెరిపెల్లి రాంచందర్, మాజీ ఎంపీటీసీ కొలిపాక సాంబయ్య, మాజీ సర్పంచ్ చెరిపెల్లి రతన్, వార్డు సభ్యులు మాదాసి భిక్షపతి, సంగెం కవిత, కరుణాకర్, కొత్తపెల్లి శ్రీదేవి, రాజు, బండి కుమారస్వామి, ఐల రమేశ్, కుక్కల యుగేందర్, బండి జ్యోతిభద్రయ్య, వాడికారి సుప్రియ, రామారావు, శీలపాక మంజులభీమయ్య, వాడికారి శివాజీ, శ్రీకాంత్, పవన్, తుమ్మనపల్లి రాజు, సంగెం చంద్రశేఖర్, సీహెచ్ అభిలాష్, వి కిరణ్, కలకోటి మహేందర్, మేకల తిరుపతి పాల్గొన్నారు.