న్యూఢిల్లీ, జూలై 22: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్.. పోస్ట్పెయిడ్ ప్లాన్ల ధరలను ఏకంగా 33 శాతం పెంచేసింది. ఈ క్రమంలోనే తమ రిటైల్, కార్పొరేట్ వినియోగదారుల కోసం మరిన్ని డాటా ప్రయోజనాలతో గురువారం ఐదేసి కొత్త కనీస నెలసరి ప్లాన్లను పరిచయం చేసింది. వీటన్నింటిలో అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతోపాటు ప్లాన్ ధరనుబట్టి అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్స్టార్ వంటివి లభిస్తున్నాయి. అయితే నూతన కస్టమర్ల కోసం ఉన్న రూ.749 ఫ్యామిలీ పోస్ట్పెయిడ్ ప్లాన్ స్థానంలో రూ.999 ఆఫర్ను ప్రకటించింది. ఈ ప్లాన్లో మరింత డాటా అందిస్తున్నామని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. కాగా, కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ ఎడ్యుకేషన్తో డాటా వినియోగం గణనీయంగా పెరగడంతో వినియోగదారులకు లాభించేలా సరికొత్త ప్లాన్లను తెచ్చామన్నది. రూ.1,599 ప్లాన్లో రిటైల్ కస్టమర్లకు అపరిమిత డాటాతో రెండు కనెక్షన్లు ఇస్తుండగా, రూ.999 ప్లాన్లో 210జీబీ డాటా, మూడు కనెక్షన్ల సౌలభ్యం ఉంటుంది.