న్యూఢిల్లీ: రిలయన్స్ జియో-గూగుల్ స్మార్ట్ ఫోన్ తమ కస్టమర్లపై ఎటువంటి ప్రభావం చూపబోదని భారతీ ఎయిర్టెల్ పేర్కొన్నది. చౌక ధరకే రిలయన్స్ జియో ఈ ఫోన్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినా తమ రెవెన్యూపై ప్రతికూల ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది.
సెర్చింజన్ గూగుల్తో కలిసి వినియోగదారులకు చౌక ధరకే 4జీ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తామని గురువారం రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఈ స్మార్ట్ ఫోన్ రాకతో ఫీచర్ ఫోన్ యూజర్లు, స్మార్ట్ ఫోన్ల యూజర్ల మధ్య అంతరాయాన్ని తొలగిస్తుందన్నారు.
యూజర్లను ఫీచర్ ఫోన్ నుంచి చౌకగా స్మార్ట్ ఫోన్ల వైపు బదిలీ అయ్యేందుకు ఈ ఫోన్ ఉపకరిస్తుందని జియో అంచనా వేస్తున్నది. కానీ తమ రెవెన్యూపై ఎటువంటి ప్రభావం ఉండబోదని జియో ప్రత్యర్థి ఎయిర్టెల్ తేల్చేసింది.
రిలయన్స్ జియో తరుచుగా చౌక ధరకు ఫోన్ ఆఫర్ చేసినా 2జీ యూజర్లు సాధారణంగానే స్మార్ట్ ఫోన్ల దిశగా అప్గ్రేడ్ అవుతున్నారని ఎయిర్ టెల్ తెలిపింది. తమ 2జీ, 3జీ కస్టమర్లను 4జీకి బదిలీ కావాలని ఎయిర్ టెల్ నిరంతరం కోరుతూనే ఉన్నది.
ఎంట్రీ లెవెల్ ఫోన్లను వాడుతున్న తమ కస్టమర్లు రూ.7000 ధరతో కూడిన క్వాలిటీ స్మార్ట్ ఫోన్ల దిశగా అప్గ్రేడ్ అవుతున్నారని తమ అనుభవం అని ఎయిర్ టెల్ పేర్కొంది. తమ బ్రాండ్, నెట్వర్క్ పట్ల ప్రాధాన్యం ఇస్తున్నారన్నది.
తమ 2జీ నెట్వర్క్ను మూసివేసేందుకు తమ వద్ద ఎటువంటి ప్రణాళికల్లేవని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. ఆమోదయోగ్యమైన రెవెన్యూ రాదని తేలినప్పుడు మాత్రమే ఆ దిశగా ఆలోచిస్తామని తెలిపింది.