Air India | కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వాటాల ఉపసంహరణ ప్రక్రియ సరైన దిశలోనే సాగుతున్నదని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. వచ్చేనెల 15 నాటికి ఫైనాన్సియల్ బిడ్లు వస్తాయన్నారు. అటుపై తదుపరి చర్యలు చేపడతామని గురువారం ఇండోర్లో మీడియాతో చెప్పారు.
ఇటీవలే కేంద్ర క్యాబినెట్లోకి సింధియాను ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంగతి తెలిసిందే.కేంద్ర రక్షణ, హోంశాఖ మంత్రులతో చర్చించిన తర్వాత దేశంలో డ్రోన్ల కార్యకలాపాల నిర్వహణకు బ్లూ ప్రింట్ సిద్ధం చేశాం అని చెప్పారు.
పెద్ద విమానం కూడా డ్రోన్ల రూట్లలో ప్రయాణిస్తే దాని నిర్వహణకు వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ సాయంతో డ్రోన్లలో ప్రజలు ప్రయాణించడానికి అనుమతినిస్తామని చెప్పారు. డ్రోన్ల యాజమాన్యాలు తమ డ్రోన్ల వివరాలను రిజిస్ట్రేషన్ చేయించుకుని లైసెన్స్ పొందాలని అన్నారు.