AC’s to be Costly | అసలే ఇది మండు వేసవి.. సూర్య భగవానుడు భగభగమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలతోపాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువే.. ఈ వేడి నుంచి రిలీఫ్ పొందాలంటే ఎయిర్ కండీషనర్ కావాలి.. మీరు కొనుక్కోవాలని డిసైడయ్యారా.. అయితే మార్కెట్లో ఎయిర్ కండిషనర్ల కొరత ఉంది. తాజాగా కొవిడ్ నివారణకు చైనాలో విధించిన కొవిడ్ లాక్డౌన్ కారణం అని డీలర్లు అంటున్నారు. ప్రస్తుతం 1/2 టన్, మూడు లేదా 5 స్టార్స్ మోడల్ ఏసీల కొరత కొనసాగుతున్నది. కార్లు.. మొబైల్ ఫోన్ల మాదిరిగానే బుక్ చేసుకున్న 15 రోజుల నుంచి నెల రోజుల వరకు వేచి చూడాల్సిందే. దీని ప్రభావంతో భానుడి కిరణాల వేడితోపాటు ఏసీలు కొనాలంటే షాక్ తగులుతుంది. అంటే కొరత వల్ల పెరిగిన డిమాండ్తో ఆయా బ్రాండ్ల ఏసీల ధరలు పెరిగిపోనున్నాయి.
ఏసీల్లో ఉపయోగించే విడి భాగాలు చైనా, ఇతర దక్షిణాసియా దేశాల నుంచే సరఫరా అవుతున్నాయి. 60 శాతం విడి భాగాలు డ్రాగన్ నుంచే పంపిణీ అవుతున్నాయి. బ్లూ స్టార్, శ్యామ్సంగ్, ఓ జనరల్.. ఒక్కటేమిటి.. అన్ని బ్రాండ్ల ఏసీల కొరత వెంటాడుతున్నది. విజయ్ సేల్స్ ఎండీ నీలేశ్ గుప్తా మాట్లాడుతూ ప్రతి ఏటా వేసవిలో ఎయిర్ కండీషనర్ల కొరత ఏర్పడటం ఇంత వరకు చూడలేదన్నారు. ఈ సారి చైనాలో కొవిడ్ లాక్డౌన్ విధించడమే కారణం అని చెప్పారు. గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది మాట్లాడుతూ.. ఒక బ్రాండ్ లేకపోతే.. కస్టమర్లు ఆల్టర్నేట్ బ్రాండ్ ఏసీ కోసం చూస్తున్నారని అన్నారు.
వచ్చే 10-20 రోజులు పరిస్థితులు దారుణంగా మారతాయంటున్నారు కమల్ నంది. ఇది ఇతర ఉత్పత్తులపైనా పడుతుందన్నారు. రూపాయి మారకం విలువ పతనం, సెమీ కండక్టర్ల కొరత వల్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని థామ్సన్ ఇండియా బ్రాండ్ లైసెన్స్ దారు సంస్థ ఎస్పీపీఎల్ సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా అంటున్నారు.