న్యూఢిల్లీ: ఆదానీ గ్రూప్ సంస్థల షేర్లు వరుసగా మూడో రోజు పతనం అయ్యాయి. గ్రూప్లోని మూడు సంస్థల స్క్రిప్టులు మూడో రోజూ లోయర్ సర్క్యూట్ను తాకాయి. వాటిలో ఆదానీ ట్రాన్సిమిషన్, ఆదానీ పవర్, ఆదానీ టోటల్ గ్యాస్ ఉన్నాయి. మూడు రోజుల్లో ఆదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.86 వేల కోట్లకు పైగా పడిపోయింది.
విదేశీ ఎఫ్పీఐ ఇన్వెస్టర్ల ఖాతాలను స్తంభింపజేసిన వార్తలు వెలుగు చూడటంతో సోమవారం ఆదానీ గ్రూప్ సంస్థల షేర్లు పతనం అయ్యాయి. సోమవారం ఆదానీ ఎంటర్ ప్రైజెస్ స్క్రిప్ట్ 22% పడిపోయింది.
దీంతోపాటు ఐదు లిస్టెడ్ కంపెనీలు 5 నుంచి 15 % నష్టపోయాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రికవరీ సాధించినా మూడు సంస్థలు లోయర్ సర్క్యూట్లోనే ఉండిపోయాయి.
గత శుక్రవారం ఆదానీ గ్రూప్కు చెందిన ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.42 లక్షల కోట్లు. గురువారానికి అది రూ.8.56 లక్షల కోట్లకు పడిపోయింది. ఆదానీ టోటల్ గ్యాస్ స్క్రిప్ట్ భారీగా పతనమైంది.
ఆదానీ టోటల్ గ్యాస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు రోజుల్లో రూ.25,494 కోట్లు పతనమైంది. గత వారం మార్కెట్ ముగిసే నాటికి ఆదానీ టోటల్ గ్యాస్ రూ.1.78 లక్షల కోట్లు.. కానీ బుధవారం అది రూ.1.53 లక్షల కోట్లకు పరిమితమైంది.
బుధవారం ఆరు కంపెనీల షేర్లు పతనం దిశగానే పయనించాయి. ఆదానీ ట్రాన్స్మిషన్, ఆదానీ పవర్, ఆదానీ టోటల్ గ్యాస్ షేర్లు లోయర్ సర్క్యూట్లోనే ఉన్నాయి. మొత్తం 5.5 శాతం పతనం అయ్యాయి.
ఆదానీ ఎంటర్ ప్రైజెస్ ఒకశాతం, ఆదానీ పోర్ట్ 4 శాతం పడిపోగా, ఆదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ మూడు శాతం దిగువన ట్రేడవుతున్నది.
మూడు సంస్థల్లో ప్రమోటర్ గౌతం ఆదానీ స్టాక్స్ 74 శాతంగా ఉంది.ఆదానీ గ్రీన్ ఎనర్జీ, ఆదానీ టోటల్ గ్యాస్ సంస్థల్లో ప్రమోటర్కు 56.29 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి.
నాలుగు కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటాలు 20 శాతానికి పైగా ఉంటుంది. ఒక సంస్థలో 11 శాతం, మరో కంపెనీలో 17 శాతం విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు కలిగి ఉన్నారు.
ఆదానీ గ్రూప్ కంపెనీల్లో ముగ్గురు విదేశీ ఇన్వెస్టర్ల వాటాలపై సెబీ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ మూడు కంపెనీలు బోగస్ అని భావిస్తున్నారు.
అబ్దుల్లా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్ ఫండ్ కంపెనీలు ఆదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టాయి.
మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్లోని ఒకే అడ్రస్ కింద మూడు సంస్థల పేర్లు రిజిస్టరై ఉన్నాయి. వాటికి వెబ్సైట్ కూడా లేదు. ఈ మూడు ఇన్వెస్ట్మెంట్ల ఖాతాలను సెబీ స్తంభింపజేసింది.
తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల ఖాతాలను స్తంభింపజేయలేదని ఆదానీ గ్రూప్ వివరణ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఇన్వెస్టర్లు ఆదానీ గ్రూప్ వివరణను విశ్వసించలేదు.