సిటీబ్యూరో, మే 21(నమస్తే తెలంగాణ) : ఓ వైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు ఉద్యోగం.. ఇంకోవైపు సేవా కార్యక్రమాలు.. వెరసి కొవిడ్ కష్టకాలంలో మహిళామనులు అండగా నిలుస్తున్నారు. అభాగ్యుల ఆకలి తీరుస్తూ.. నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ.. కొవిడ్ పేషెంట్లకు ఉచిత ఆహారం అందిస్తూ వనితలు ఆదర్శంగా నిలుస్తున్నారు. తొలుత చిన్న వాట్సప్ గ్రూప్గా ఏర్పడి.. క్రమక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తూ వాట్సప్ సమూహాలుగా అవతరించింది డియర్ ఐక్య వేదిక. ప్రతీ జిల్లా నుంచి వాలీంటీర్లు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటారు. కాల్ చేస్తే చాలు సాయం ఇంటికి చేరుతుంది. జిల్లాల వారీగా మహిళలు ఆయాప్రాంతాల్లో జరిగే సహాయకార్యక్రమాలపై లీడ్ తీసుకుంటారు. కరీంనగర్కు చెందిన శ్వేతా.. ఈ గ్రూప్ ఏర్పాటు చేసింది. గత ఏడాది కొవిడ్ నుంచి ప్రస్తుతం వరకు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా డియర్ ఐక్య వేదిక సభ్యులు ఉంటారు. 8374515975 నెంబర్కు ఫోన్ చేస్తే అవసరమైన సాయం అందిస్తారు. తాజాకూరగాయలు, పప్పులు, నూనె, పోషకాహారంతో కూడిన ఆహారం, సరుకులు అందించడంతో పాటు దద్ద్యోజనం(పెరుగన్నం) అందిస్తున్నారు. ఇటీవల సద్దన్నం ప్రాధాన్యతను వైద్యులు సూచించడంతో కరోనా పేషెంట్ల మెనూలో దీనిని కూడా చేర్చారు. అంతేకాదు ఆసుపత్రుల్లో ఉండే కొవిడ్ పేషెంట్ల సహాయకులకు కూడా ఆహారాన్ని అందిస్తారు. కొవిడ్ సెకెండ్ వేవ్లో ఇప్పటి వరకు సుమారు 1500 మందికి సాయం అందించారు. అవసరమున్న వారికి ఆర్థిక సాయం సైతం అందిస్తుంది ఈ వేదిక.
కొవిడ్ ప్రభావంతో శుభకార్యాలు జరగడం లేదు. దీంతో పూజారులకు ఉపాది దొరకడం కష్టంగా మారింది. ప్రస్తుతం వారు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి వారికి సైతం అండగా నిలుస్తామని డియర్ ఐక్యవేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద పురోహితులు సాయం కోరితే వారికి అవసరమైన హెల్ప్ చేస్తామని సభ్యులు పేర్కొన్నారు.
మహిళల ఆత్మైస్థెర్యం పెంచడానికి ఏర్పాటు చేసుకున్న వేదిక ప్రస్తుత ఆపత్కాలంలో తోడుగా నిలవాలని సేవా కార్యక్రమాలను తలపెట్టింది. కూరగాయలు, పప్పులు, పండ్లు, డ్రైఫ్రూట్స్ అందిస్తున్నాం. మా వాట్సప్ గ్రూప్లో ఉన్న వాళ్లమే తలా కొంత డబ్బులు వేసుకుని ఈ సాయం అందిస్తున్నాం. డియర్ ఐక్యవేదికలో భాగం కావడం సంతోషంగా ఉంది. కొవిడ్ సంక్షోభంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. – శోభరాణి, మోటివేషనల్ స్పీకర్.
ఈ ఐక్యవేదిక మొదట మహిళల అభ్యున్నతి కోసం ప్రారంభించాం. కాలక్రమేణ వ్యవస్థాపకురాలు శ్వేత ఆలోచన నుంచి సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాలని భావించాం. గత లాక్డౌన్ నుంచి నిరుపేదలను ఆదుకుంటున్నాం. మాస్క్లు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నాం. అవసరమున్న వార్ కాల్ చేసి లొకేషన్ చెబితే చాలు. మా వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి కావాల్సిన సరుకులను అందిస్తారు. -సంతోషి చక్రధర్
ప్రస్తతం క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. కొవిడ్ కుటంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. పెద్ద దిక్కు కోల్పోయి ఫ్యామిలీలు ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్ బాధితులు ఆర్థిక స్థోమత లేక సరైన పోషకాహారం తీసుకోవడం లేదు. అలాంటి వారందరికి మా ఆర్గనైజేషన్ ద్వారా సాయం అందిస్తున్నాం. వాట్సప్ గ్రూప్ వేదికగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. గ్రూప్ సభ్యులంతా కలిసి ఫండ్ సేకరించి వాటితో సాయం అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మా సేవలు అందుతాయి. వీటితో పాటు పూజారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అవసరమున్న వారికి సాయం అందిస్తున్నాం. కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో ఒకరికొకరూ అండగా నిలిస్తేనే అవరోధాన్ని దాటగలం.శ్వేత రఘురాం గోవర్దన, వ్యవస్థాపకురాలు, డియర్ ఐక్య వేదిక.