న్యూఢిల్లీ: బుల్లెట్ రైళ్ల అంశంలో ఇవాళ లోక్సభలో బీజేపీ, శివసేన మధ్య వాగ్వాదం జరిగింది. శివసేన ఎంపీ ప్రతాప్ రావ్ జాదవ్ బుల్లెట్ రైళ్ల గురించి ప్రశ్న వేశారు. ముంబై నుంచి నాగపూర్ మధ్య కొత్తగా బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడుతున్నారా అని ఆయన అడిగారు. అలాంటి ప్రణాళికలు ఉంటే వెల్లడించాలన్నారు. దీనిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య తొలి హై స్పీడ్ రైలును ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీని కోసం జరుగుతున్న భూసేకరణ పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో కేవలం 24 శాతం మాత్రమే భూమిని సేకరించినట్లు ఆయన చెప్పారు. కానీ గుజరాత్లో భూసేకరణ పూర్తి ఆయనట్లు ఆయన చెప్పారు. అయితే పనులు వేగంగా జరిగితే, అప్పుడు ప్రభుత్వం కచ్చితంగా ముంబై-నాగపూర్ రూట్లో హై స్పీడ్ రైళ్లను తీసుకువస్తుందన్నారు. బుల్లెట్ రైళ్ల కోసం ఇప్పటి వరకు ముంబైలో భూమిని సేకరించలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇదే సమయంలో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ మరో అంశాన్ని లేవనెత్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి లక్ష కోట్ల బాకీ రావాల్సి ఉందన్నారు. దీంట్లో వాస్తవం లేదని మంత్రి గోయల్ అన్నారు. గతంలో ప్రభుత్వాలు కేవలం ప్రాజెక్టులను ప్రకటించాయని, కానీ ఎటువంటి బడ్జెట్ను కేటాయించలేదన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పనిచేస్తోందన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.