న్యూఢిల్లీ: 2021 ఏడాదిలో అన్ని వస్తువుల ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే, నిన్న గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. మరోవైపు ఎండలు బాగా మండుతున్నాయి. ఇంతకుముందు ఒకసారి పెరిగిన ఎయిర్ కండీషనర్ ధరలు పెరుగనున్నాయి. ధరలను పెంచుకోవడానికి ఈ ఏసీ తయారీ సంస్థలు వాటి తయారీలో ఉపయోగించే మెటల్, కంప్రెసర్ రేట్ల పెరుగుదలను సాకుగా చూపుతున్నాయి.
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గించేందుకు ఐటీతోపాటు పలు కార్పొరేట్ సంస్థలు దాదాపు తమ సిబ్బంది మొత్తానికి వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చాయి. వేసవిలో వేడి తగ్గించుకోవడానికి ఏసీలు కొనాలని తలపోస్తున్న ఐటీ నిపుణులకు.. ఇతర వర్గాల ఉద్యోగులకు ముడి సరుకుల ఖర్చు పెరుగుదల సాకుతో ఏసీ తయారీ సంస్థలు వాటి ధరలు పెంచి షాక్ ఇవ్వనున్నాయి.
దాదాపు అన్ని ఏసీ కంపెనీలూ ఐదు నుంచి ఎనిమిది శాతం మేర ధరలు పెంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో 6-8 శాతం ధరలు పెంచనున్నట్లు పానాసోనిక్ వెల్లడించింది. రిఫ్రిజిరేటర్ల ధరలు సైతం 3-4 శాతం పెంచనున్నట్లు పానాసోనిక్ దక్షిణాసియా విభాగం అధ్యక్షుడు కం సీఈవో మనీశ్ శర్మ తెలిపారు. ఏసీల ధరలు 3 నుంచి 5 శాతం పెంచనున్నట్లు డైకిన్ తెలిపింది. టాటా సన్స్ గ్రూప్ అనుబంధ వోల్టాస్ సంస్థ ఇప్పటికే ఏసీల ధరలు పెంచేసింది. ముడి సరకుల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వోల్టాస్ పేర్కొంది.
ఇప్పటికే వివిధ శ్రేణి ఏసీలపై 5-8 శాతం ధరలను పెంచేసిన మరో సంస్థ బ్లూస్టార్.. మరో సారి వచ్చే నెలలో 3 శాతం మేర ధరలు పెంచేందుకు సన్నద్ధం అవుతోంది. 2019తో పోలిస్తే ఈ ఏడాది ఏసీల విక్రయాలు 30 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు బ్లూస్టార్ ఎండీ త్యాగరాజన్ తెలిపారు. హైయర్ కంపెనీ సైతం 8 శాతం మేర ధరలు పెంచడానికి సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులోపే ధరలు పెంచుతామని హైయర్ కంపెనీ ప్రతినిధి తెలిపారు.
ధరలు పెంచినా.. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ కింద నిపుణులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నందున ఈ సీజన్లో రెండంకెల అభివృద్ధి నమోదవుతుందని ఏసీ తయారీ కంపెనీలు ఆశావహ దృక్పథంతో ఎదురుచూస్తున్నాయి. తమ ఉత్పత్తుల గిరాకీకి ఢోకా ఉండదని వోల్టాస్, డైకిన్, ఎల్జీ, పానాసోనిక్, హైయర్, బ్లూస్టార్, శాంసంగ్ వంటి కంపెనీలు అశాభావంతో ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ, క్యాష్బ్యాక్ వంటి వసతులతో సేల్స్ పెంచుకునేందుకు సిద్ధం అవుతున్నాయి.
ఏసీలపై ధరల పెంపు ప్రభావం తమ సేల్స్ మీద కొంతమేర మాత్రమే ఉంటుందని, డిమాండ్ ఏమాత్రం తగ్గదని డైకిన్ ఇండియా ఎండీ సీఈవో కన్వాల్ జీత్ జావా అంచనా వేశారు. ఈ వేసవిలో వేడి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో 40 నుంచి 45 శాతం మేర అమ్మకాల్లో వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేస్తున్నామని ఎల్జీ తెలిపింది.
ముడి సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఉత్పత్తి వ్యయం 10-12 శాతం పెరిగిందని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) తెలిపింది. ప్రస్తుతం ఐదారు శాతం మేర మాత్రమే ధరల పెరుగుదల ఉందని, మిగిలిన ఐదారు శాతం ఏప్రిల్లో ఉంటుందని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ కమల్ నాంది తెలిపారు. ఏటా దేశంలో 70 నుంచి 75 లక్షల ఏసీలు అమ్ముడవుతున్నాయి.