సరికొత్తగా రీజినల్, సెంట్రల్ ల్రైబరీలు
భవనానికి పుస్తకాల డిజైన్తో రంగులు
రూ.4కోట్లతో ఆధునీకరణ
అధునాతనంగా లెక్చర్ హాల్, సీటింగ్
పుస్తకాల డిజిటలైజేషన్
నోటిఫికేషన్ల నేపథ్యంలో యువత క్యూ
వరంగల్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లైబ్రరీల ఆధునీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాత లైబ్రరీలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. కట్టె బల్లలు, అల్మారాల స్థానంలో కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నది. కార్పొరేట్ స్థాయిలో వాటిని తీర్చిదిద్దుతున్నది. ఇందులో భాగం గా వరంగల్ నగరంలోని రీజినల్, సెంట్రల్ లైబ్రరీలను ఒక్కోదానికి రూ.రెండు కోట్ల చొప్పున ఖర్చు చేసి స్మార్ట్ లైబ్రరీలుగా మారుస్తున్నది. వేలాది మందికి విజ్ఞానం పంచి ఈ లైబ్రరీలు ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంటున్నాయి. కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ రెండు లైబ్రరీల ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నా యి. దశాబ్దాల క్రితం కట్టిన ఈ భవనాలను ఆధునికం గా మారుస్తున్నారు. గోడలు, ఫర్నిచర్, ఎలక్ట్రికల్ సిస్టమ్ను సరికొత్తగా మార్చుతున్నారు. రీజినల్ లైబ్రరీ భవనానికి వేసిన రంగులు, బొమ్మలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రూ.60లక్షలతో భవనం ఆధునీకరణ పను లు చేపట్టారు. మరో రూ.45 లక్షలతో ఫర్నిచర్ కోనుగోలు చేశారు. హన్మకొండలోని సెంట్రల్ లైబ్రరీని రూ.1.30కోట్లతో ఆధునీకరిస్తున్నారు. ఈ భవనం మరమ్మతులు పూర్తయ్యాయి. ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నాయి. సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో శిథిలభవాన్ని కూల్చి వేసి రూ.50 లక్షలతో కొత్త భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు.
లైబ్రరీల డిజిటలైజేషన్
ఈ లైబ్రరీలను పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఇంటర్నెట్, వైఫై సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుత పోటీప్రపంచంలో పేద విద్యార్థులకు ఉపయోగంగా ఉండేలా లైబ్రరీలను తీర్చిదిద్దుతున్నారు. పాత కాలం కర్ర ఆల్మారాల్లో భద్రపరిచిన పుస్తకాల కోసం ప్రత్యేక ర్యాక్లు ఏర్పాటు చేస్తున్నారు. కుర్చీలు, టేబుళ్లు, బుక్ ర్యాక్స్, కంప్యూటర్లు, పిల్లల ఫర్నిచర్, ప్రత్యేకంగా లెక్చ ర్ హాల్, సీటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రతి పుస్తకాన్ని డిజిటల్ వ్యవస్థలో ఉపయోగించే ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రక నగరానికి వచ్చే పర్యాటకులకు సైతం ఈ లైబ్రరీలు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి.