సిటీబ్యూరో, జూలై 10(నమస్తే తెలంగాణ): పెళ్లాం వదిలేసిన భర్త కిరాతకంగా వ్యవహరిస్తూ తన వరుస లైంగిక కోరికలకు చిన్నారులను బలి చేస్తూ ఇటీవల రాచకొండ పోలీసులకు చిక్కాడు. ఐదు రోజుల కిందట జవహర్నగర్ పీఎస్ పరిధిలో మూడున్నర ఏండ్ల పాప అదృశ్యమై అపస్మారక స్థితిలో దొరికిన విషయం తెలిసిందే. రాచకొండ పోలీసుల ప్రకారం, ఒడిషా రాష్ర్టానికి చెందిన అభిరామ్ దాస్ 12 ఏండ్ల కింద నగరానికి వచ్చి కీసర బండ్లగూడ 60 గజాల కాలనీలో ఉంటున్నాడు. వృత్తి రీత్యా మేస్త్రీ. ఎనిమిదేళ్ల కింద అతని ప్రవర్తన నచ్చక భార్య వదిలేసిపోయింది. అప్పటి నుంచి అభిరామ్ దాసు లైంగిక కోరికలను తీర్చుకునేందుకు చిన్నారులను ఎంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఈ నెల 4న దమ్మాయిగూడ ప్రాంతంలో ఓ చిన్నారి ఆడుకుంటుండగా బాలికకు మాయ మాటలు చెప్పి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి తీసుకుపోయి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మరుసటి రోజు వాటర్ ట్యాంక్ వద్ద వదిలేసి పోయాడు. శుక్రవారం మధ్యాహ్నం ప్రగతినగర్ ప్రాంతంలోని కిరాణ దుకాణం వద్ద ఓ బాలికతో ఎరుపు రంగు టీ-షర్టు ధరించిన వ్యక్తి అభ్యంతకరంగా ప్రవర్తించాడు. ఇది చూసిన బాలిక తల్లి కేకలు పెట్టింది. అతను వెంటనే సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, ఇతర క్లూస్ ద్వారా ఎరుపు రంగు టీ షర్టు ధరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా 4వ తేదీన జరిగిన ఘటన కూడా తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.