న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు తీపి కబురు అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఏడో వేతన సవరణ సంఘం సిఫారసులకు అనుగుణంగా హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) పెంచాలని నిర్ణయించింది. ఆగస్టు నుంచి కేంద్ర ప్రభుత్వోద్యోగుల హెచ్ఆర్ఏ స్థూలంగా 27 శాతం పెరుగనున్నది. ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుంది. పెరిగిన హెచ్ఆర్ఏ ఆగస్టు నుంచి అమలులోకి రానున్నది. హెచ్ఆర్ఏ ప్రతి ఒక్క ఉద్యోగి వేతనంలో తప్పనిసరి భాగంగా పరిగణించాలని కేంద్రం నిర్ణయించింది.
ఒక నగరం నుంచి మరో నగరానికి హెచ్ఆర్ఏలో తేడాలు ఉంటాయి. నగరాలను మూడు క్యాటగిరీలుగా విభించించింది కేంద్రం. ప్రథమ శ్రేణి నగరాల్లో నివసించే ఉద్యోగులకు 27 శాతం, ద్వితీయ శ్రేణి నగరాల్లో పని చేసే వారికి 18 శాతం, త్రుతీయ శ్రేణి నగరాల్లో విధులు నిర్వర్తించే వారికి 9 శాతం పెరుగనున్నది.
ఉద్యోగుల డీఏ కూడా భారీగా పెరుగుతుంది. కనీస వేతనంలో డీఏ 17 నుంచి 28 శాతం పెరుగుతుంది. ఇది జూలై నుంచి అమలులోకి వచ్చింది. ఇది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. దీనివల్ల 48.34 లక్షల మంది ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు బెనిఫిట్ కానున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై నుంచి వచ్చే ఫిబ్రవరి వరకు ఎనిమిది నెలల్లో రూ.22,934.56 కోట్ల మేరకు ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. ఏడాదికి రూ.34,401.84 కోట్ల భారం పడుతుంది.