న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు రిలీఫ్ లభించనున్నది. వచ్చే జూలై ఒకటో తేదీ నుంచి వారికి కరువు భత్యం (డీఏ) చెల్లింపులు అమలులోకి రానున్నది. మూడు వాయిదాల డీఏను జూలై ఒకటో తేదీ నుంచి చెల్లిస్తామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.
గత నెలలో రాజ్యసభలో సభ్యులు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. పెండింగ్లో ఉన్న మూడు డీఏలు, సవరించిన రేట్ల ప్రకారం చెల్లిస్తామని చెప్పారు. కరోనా నేపథ్యంలో 2020 జనవరి ఒకటో తేదీ, జూలై ఒకటో తేదీ, 2021 జనవరి ఒకటో తేదీన చెల్లించాల్సిన డీఏను కేంద్రం పెండింగ్లో పెట్టిన సగతి తెలిసిందే.
ఇప్పుడు కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు 17 శాతం డీఏ పొందుతున్నారు. ఏడవ వేతన సవరణ కమిషన్ సిఫారసుల ప్రకారం వారి డీఏ పెరుగనున్నది.
2020 జనవరి ఒకటో తేదీ నుంచి మూడు శాతం పెంపుతో 28 శాతం, జూలై ఒకటో తేదీ నుంచి నాలుగు శాతం, 2021 జనవరి ఒకటో తేదీ నుంచి నాలుగు శాతంతో కలిపి వారి వేతనంలో అందుకోనున్నారు. దీంతో కేంద్ర ఉద్యోగులు ఇంటికి తీసుకెళ్లే వేతనం మొత్తం గణనీయంగా పెరుగనున్నది.
డీఏ చెల్లింపును పునరుద్ధరించడంతో 65 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు, 52 లక్షల మంది ఉద్యోగులకు భారీ రిలీఫ్ లభిస్తుంది. ఒకసారి డీఏ పునరుద్ధరిస్తే పెన్షనర్ల పెన్షన్ కూడా జూలై ఒకటో తేదీ నుంచి పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వోద్యోగుల స్థూల వేతనంలో బేసిక్ పే, డీఏ, ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ), ప్రయాణ భత్యం (టీఏ), వైద్య అలవెన్స్ తదితరాలు కలుస్తాయి.
ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు అందుకుంటున్న డీఏ 17 శాతం. ఇది 28 శాతానికి పెరుగుతుంది. దీని ప్రకారం ఉదాహరణకు కేంద్ర ఉద్యోగి కనీస వేతనం రూ.18 వేలు ఉంటే, నెలవారీగా డీఏ రూ.3,060 నుంచి రూ.5,040 వరకు పెరుగుతుంది.
ప్రతిపాదిత డీఏ పెరుగడంతో వారి ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్), గ్రాట్యూటీ కూడా పెరుగుతాయి. కనీస వేతనంలో నిర్దిష్ఠ శాతం, డీఏతో కలిపి పీఎఫ్, గ్రాట్యూటీ భాగస్వామ్యాన్ని నిర్ణయిస్తారు.