కాలిఫోర్నియా: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. సంస్థ చరిత్రలో తొలిసారి దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.75 లక్షల కోట్ల (లక్ష కోట్ల డాలర్లు) మార్క్ను చేరుకున్నది.
మరోవైపు యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నదన్న ఫేస్బుక్కు వ్యతిరేకంగా దాఖలైన కేసును ఓ అమెరికా న్యాయస్థానం కొట్టేసింది.
ఫేస్బుక్కు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో సంస్థ షేర్లు సోమవారం నాలుగు శాతానికి పైగా లాభ పడ్డాయి. దీంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల డాలర్లను దాటింది. ఫేస్బుక్కు వ్యతిరేకంగా దాఖలైన కేసును కోర్టు తోసిపుచ్చడంతో స్టేట్ అండ్ ఫెడరల్ దర్యాప్తు సంస్థలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
సోషల్ నెట్వర్క్ మార్కెట్లో ఫేస్బుక్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నదని యూఎస్ ఎఫ్టీసీ రుజువు చేయడంలో విఫలమైందని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా జడ్జి జేమ్స్ బోస్ బర్గ్ పేర్కొన్నారు.
దీనిపై జూలై 29న ఎఫ్టీసీ కొత్త కేసు ఫైల్ చేయొచ్చునన్నారు. చట్ట పరంగా ఎఫ్టీసీ ఫిర్యాదు సరిగా లేదని జడ్జి చెప్పారు. ఫేస్బుక్ 60 శాతానికి పైగా మార్కెట్ షేర్ పొందుతున్నట్లు ఆధారాలు చూపలేకపోయిందని వ్యాఖ్యానించారు.
యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆఫ్ కొలంబియా తీర్పుపై న్యాయపరమైన ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు న్యూయార్క్ అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది. ఫేస్బుక్, ఆల్ఫాబెట్ గూగుల్కు వ్యతిరేకంగా పలు రాష్ట్రాలు పిటిషన్లు దాఖలు చేశాయి.