జిల్లాలో 30 నుంచి 9 శాతానికి తగ్గిన కరోనా
చికిత్స అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు
వ్యాక్సిన్ తీసుకున్నోళ్లు జాగ్రత్తలు పాటించాలి
మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, మే 29 : రాష్ట్రం లో కొవిడ్ కట్టడిలో సీఎం కేసీఆర్ పాత్ర అమోగమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ బాలుర పాఠశాల ఆవరణలో సూపర్స్ప్రెడర్కు కేటాయించిన వ్యాక్సిన్ సెంటర్లో శనివారం మంత్రి, జడ్పీ చైర్పర్సన్ బిందు రెండో డోస్ టీకా తీసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ గౌతమ్, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… జిల్లాలో కరోనావ్యాప్తి 30 నుంచి తొమ్మిది శాతానికి తగ్గిందన్నారు. కరోనా కట్టడిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సఫలీకృతులయ్యారని అభినందించారు. ఇలాగే మరికొన్ని రోజులు కష్టపడితే కొవిడ్ను జిల్లా నుంచి పూర్తిగా తరిమికొట్టొచ్చన్నారు. కొవిడ్ బాధితులకు మెరుగైన సేవలు అందించి మరణాల శాతం తగ్గించిన వైద్యులు కనిపించే ప్రత్యక్ష దైవాలని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు మండలాలు, గ్రామాల్లో టాస్క్ఫోర్స్ కమిటీలు, 450 జ్వర సర్వే వైద్య బృందాలు పని చేస్తున్నాయన్నారు. కొవిడ్ రెండో దశలో జిల్లాలో 88,740 మందికి పరీక్షలు చేసి పాజిటివ్ ఉన్న వారికి మెడికల్ కిట్లు అదించినట్లు తెలిపారు. ప్రతి రోజూ 3వేల మందికి ర్యాపిడ్, 150 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. 2 వేల పల్స్ ఆక్సీమీటర్లతో వైద్య బృందాలు గ్రామాల్లోని ప్రజలకు పల్స్ చెక్ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కొవిడ్ కట్టడి చేస్తున్న కృషి చాలా గొప్పగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించి 33 శాతం ఉన్న కొవిడ్ను 8 శాతానికి తగ్గించడమంటే మాటలు కాదని, దాని వెనుక కేసీఆర్ ఎంతో కృషి ఉందన్నారు. కరోనా కష్టకాలంలో రైతులకు ఇబ్బంది కలుగొద్దనే ధాన్యం కొంటున్నట్లు చెప్పారు. వానకాలంలో సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, అదనపు కలెక్టర్లు అభిలాషఅభినవ్, కొమురయ్య, వైద్యాధికారి హరీశ్రాజ్, ఆస్పత్రి పర్యవేక్షకుడు వెంకట్రాములు, కొవిడ్ వార్డు నోడల్ అధికారి డాక్టర్ సతీశ్రాథోడ్, జిల్లా కొవిడ్ నోడల్ అధికారి రాజేశ్ పాల్గొన్నారు.