పల్లె ప్రగతి పనుల్లో ముందంజ
మొక్కల పెంపకంతో కొత్తకళ
చిన్న పంచాయతీ.. అభివృద్ధిలో మిన్న
అన్ని వసతులతో శ్మశానవాటిక
టేకులపల్లి, జూన్ 29 : టేకులపల్లిలోని రామచంద్రునిపేట పల్లె ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. బోడు పంచాయతీలో శివారు గ్రామంగా సరైన వసతులు లేక అధ్వానంగా దర్శనమిచ్చేది. రోడ్లపైనే చెత్తా చెదారం నిలిచి ఉండేది. వానకాలంలో వీధుల్లో వరద నీరు నిలిచి ఉండేది. ఒక మనిషి చనిపోతే అంతిమ సంస్కారాలకు శ్మశానవాటిక లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేక ఏటా సీజనల్ వ్యాధులు విజృంభించేవి. కానీ, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లె రూపురేఖలే మారిపోయాయి. జనాభా ప్రాతిపదికన పల్లె పంచాయతీగా ఏర్పడింది. పల్లె ప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించింది. 1,790 జనాభా ఉన్న ఈ గ్రామం డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, నర్సరీతో పల్లె కళకళలాడుతున్నది.
జరిగిన అభివృద్ధి ఇదీ..
రామచంద్రునిపేట పంచాయతీ పరిధిలో మురుట్ల, పాతర్ల గడ్డ, పాతర్ల గడ్డ తండా, తోల్లెం రామయ్య గుంపు ఉన్నాయి. గ్రామంలో 443 ఇళ్లు ఉండగా, వీటిలో 418 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. పంచాయతీ పరిధిలో నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న రహదారికి రెండు వైపులా పాలకవర్గం అవెన్యూ ప్లాంటేషన్ కింద 1,600 మొక్కలు నాటించింది. వీటికి రూ.3.38 లక్షలతో ట్రీ గార్డులు ఏర్పాటు చేయించింది. హరితహారం భాగంలో నాటిన మొక్కల్లో 95శాతం మొక్కలను బతికించింది. గ్రామంలో ఇంటికి 10 మొక్కల చొప్పున 4 వేల మొక్కలు, పొలం గట్లపై 2 వేల మొక్కలు నాటించింది. పంచాయతీ పరిధిలో ఐదు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయించింది. వీటిలో 4 వేల మొక్కలు పెంచుతున్నది. వీటి చుట్టూ రూ.8 లక్షల వ్యయంతో కంపౌండ్ వాల్ నిర్మించింది. పార్కులకు బోరు మోటర్ వసతి కల్పించింది. నర్సరీలో 15వేల మొక్కలు పెంచుతున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రాక్టర్, ట్రాలీతో ప్రతిరోజు పారిశుధ్య సిబ్బంది పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. గ్రామంలో నాటిన మొక్కలకు నీరు పెడుతున్నారు. పాలకవర్గం గ్రామంలో రూ.12.50 లక్షలతో శ్మశాన వాటిక, రూ.2.50 లక్షలతో డంపింగ్ షెడ్ నిర్మించింది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ షెడ్లో సేంద్రియ ఎరువులు తయారు చేయిస్తున్నది. గ్రామంలో జనాభా 1,790 మంది ఉండగా 995మందికే సీఎఫ్సీ, ఎస్ఎఫ్సీ నిధులు వస్తున్నాయని, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తే మరింత అభివృద్ధి చేస్తామని సర్పంచ్ తెలిపారు.