న్యూఢిల్లీ/న్యూయార్క్, ఫిబ్రవరి 12: ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్మిట్టల్ వచ్చే సంవత్సరం చివరి నాటికి 1 బిలియన్ డాలర్ల (రూ.7,261 కోట్ల) ఖర్చులను తగ్గించుకోవాలని నిశ్చయించుకున్నది. దీనిలో భాగంగా తన కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఉక్కు ఉత్పత్తి, మైనింగ్లో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా కొనసాగుతున్న ఆర్సెలార్మిట్టల్.. ప్రస్తుతం 60 దేశాల్లో కార్యకలాపాలను సాగిస్తున్నది. 17 దేశాల్లో ఉక్కు ఉత్పత్తి కేంద్రాలను కలిగి ఉన్న ఈ కంపెనీలో సుమారు 1.90 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఖర్చుల కుదింపునకు సంబంధించిన ప్రణాళికలో భాగంగా కార్పొరేట్ కార్యాలయాల్లోని ఉద్యోగులు, కాంట్రాక్టర్ల సంఖ్యను తగ్గించడం, వనరుల మళ్లింపు లాంటి చర్యలు చేపట్టనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. కొవిడ్-19 సంక్షోభానంతరం మార్కెట్లో నిలదొక్కుకునేందుకు, ఇతర సంస్థల నుంచి ఎదురయ్యే పోటీని సమర్థంగా అధిగమించి లాభదాయకతను కాపాడుకునేందుకు ఈ చర్యలు చేపట్టక తప్పడంలేదని స్పష్టం చేసింది. తద్వారా దాదాపు 40 వేల మంది సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వెల్లడించింది. వ్యాపారాన్ని మెరుగుపర్చుకోవడంలో భాగంగా క్రాకోవ్ (పోలెండ్)లోని బ్లాస్ట్ ఫర్నేస్, స్టీల్ ప్లాంట్తోపాటు దక్షిణాఫ్రికాలోని సల్దన్హా కేంద్రాన్ని, ఫ్లోరెంజ్ కోక్ ఒవెన్ బ్యాటరీని ఇప్పటికే శాశ్వతంగా మూసివేసినట్లు ఆర్సెలార్మిట్టల్ వివరించింది.