హైదరాబాద్, 26 జూన్ (నమస్తే తెలంగాణ): ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అన్న నానుడిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణలో నిజంచేసి చూపించారని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వటమే కాకుండా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడపిల్లల పెండ్లికి మేనమామలా ఆర్థికంగా దన్నుగా నిలబడ్డ ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. శనివారం హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీరంలోని నెక్లెస్రోడ్డు అంబేద్కర్ నగర్లో నిర్మించిన 330 డబుల్బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులనుద్దేశించి మాట్లాడుతూ.. 28 రాష్ర్టాలు, ఆరు పెద్ద నగరాల్లో ఎక్కడాలేనివిధంగా పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లను అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. నగరంలో అత్యంత విలువైన ప్రాంతంలో లేక్వ్యూ, లేక్ఫ్రంట్ గృహాలను పేదలకు ఇవ్వడం సంతోషకరంగా ఉన్నదని చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రైవేట్ అపార్ట్మెంట్ల ధరలు రూ.1.5 కోట్లు పలుకుతున్నట్టు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఇంత విలువైన చోట పేదలకు పూర్తి ఉచితంగా ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని వెల్లడించారు.
పచ్చదనం పరిశుభ్రత పాటించాలి
సీఎంకు పచ్చదనం అంటే ఇష్టమని, సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రంలోని గ్రీనరీని 23 శాతం నుంచి 28 శాతానికి పెంచినట్లు తెలిపారు. అంబేద్కర్ కాలనీవాసులు పచ్చదనం-పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కాలనీలో పెద్ద ఎత్తున చెట్లు పంచాలని, ఈ బాధ్యతను మహిళలే చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. మురికికూపంగా మారిన హుస్సేన్సాగర్ను శుద్ధిచేసే పనులు కొనసాగుతున్నట్లు, దీన్ని దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ కాలనీవాసులు వ్యర్థాలను సాగర్లో వేయకుండా ఉండాలని కోరారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని చేపట్టినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ ఐదుగురు లబ్ధిదారులకు లాంఛనంగా ఇండ్ల పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్అలీ, ఎమ్మెల్సీ వాణీదేవి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి పాల్గొన్నారు.
ఏ నగరంలోనూ ఇలాంటి స్కీం లేదు
దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ఆరు పెద్ద నగరాలుండగా, హైదరాబాద్ మినహా మిగిలిన ఏ నగరంలోనూ ఇటువంటి గృహనిర్మాణ పథకం అమలుచేయడంలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. రూ.9,000 కోట్ల పైచిలుకు పెట్టుబడితో పేదలకు ఇండ్లు నిర్మిస్తున్న నగరం మరొకటి లేదని తెలిపారు. ఎవ్వరికీ పైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా లబ్ధిదారులందరికీ చిట్టీలు తీసి పారదర్శకంగా ఇండ్లను కేటాయిస్తున్నామన్నారు. మంత్రి తలసాని విజ్ఞప్తి మేరకు అంబేద్కర్నగర్ సమీపంలోని రెండు గోదాములు, ఒక డెయిరీని తొలగించి కాలనీవాసుల సౌకర్యార్థం ఒక దవాఖాన, ఒక కమ్యునిటీహాలును నిర్మించి ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇంకా మిగిలిపోయిన లబ్దిదారులు ఎవరైనా ఉంటే వారికి అక్కడే ఇండ్లను కట్టించి ఇస్తామన్నారు.