భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 883, నిఫ్టీ 258 పాయింట్లు క్షీణత
ముంబై, ఏప్రిల్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లను మళ్లీ కరోనా వైరస్ కుదిపేస్తున్నది. కొవిడ్-19 కేసులు పెద్ద ఎత్తున పెరుగుతుండటం, ఆయా రాష్ర్టాలు లాక్డౌన్లను ప్రకటిస్తుండటంతో మదుపరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో సోమవారం ఒక్కరోజే మదుపరుల సంపద రూ.3 లక్షల 53,420.76 కోట్లు హరించుకుపోయింది. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నా.. బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ మాత్రం 882.61 పాయింట్లు లేదా 1.81 శాతం పడిపోయి 47,949.42 వద్దకు చేరింది. ఒకానొక దశలో 1,469 పాయింట్లకుపైగా పతనం కావడం గమనార్హం. పవర్గ్రిడ్ షేర్ విలువ అత్యధికంగా 4.17 శాతం దిగజారింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 258.40 పాయింట్లు లేదా 1.77 శాతం క్షీణించి 14,359.45 పాయింట్ల వద్ద నిలిచింది.
‘ఆక్సీజన్’ క్రేజ్
కరోనా విజృంభణ నేపథ్యంలో ఆక్సిజన్కు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ పరిస్థితి.. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఆ పేరున్న షేర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నది. బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ షేర్ విలువ సోమవారం ఏకంగా రూ.1,170.20 ఎగబాకి రూ.24,574.85ను తాకింది. అలాగే ‘గ్యాస్’ అన్న పదం ఏ సంస్థ పేరులో కనిపించినా.. మదుపరులు విశేషంగా ఆదరిస్తున్నారు. నిజానికి ఈ సంస్థలకు ఆక్స్సిజన్కు ఎలాంటి సంబంధం లేదు. పైగా బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పేరు ప్రస్తుతం బాంబే ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్గా మారింది. అయినా మదుపరులు ఎగబడి కొనేస్తున్నారు. దీంతో అటు స్టాక్ మార్కెట్, ఇటు సెబీ వర్గాలు ఈ పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నాయి.
బక్కచిక్కిన రూపాయి
మరోవైపు రూపాయి విలువ భారీగా పతనమైంది. అమెరికా డాలర్తో పోల్చి తే రూపాయి మారకం విలువ సోమవారం 53 పైసలు క్షీణించి 74.87కు పడిపోయింది.