న్యూఢిల్లీ: భూమి అప్పుడెప్పుడో 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని మనకు తెలుసు. కానీ అది కచ్చితంగా ఎలా ఏర్పడింది? భూమిలోని మూడు పొరల్లో కింది రెండింట్లో అసలు ఏముంది అన్న విషయాలపై మాత్రం మనకు ఇంకా స్పష్టత లేదు. భూమిలో క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అనే మూడు పొరలు ఉంటాయి. వీటిలో పైన ఉండే క్రస్ట్ గురించి, అదెలా ఏర్పడిందన్నదాని గురించి ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనలు ఓ అంచనాకు వచ్చాయి. కానీ లోపల ఉండే మ్యాంటిల్, కోర్ల గురించి పెద్దగా తెలియదు. ఇప్పుడు అస్సాంలో పడిన ఓ ఉల్కలో దీని తాలూకు రహస్యాలను పరిశోధకులు వెతుకుతున్నారు.
ఐఐటీ ఖరగ్పూర్లోని విద్యార్థులు, రీసెర్చర్లు ఆ ఉల్కను పరిశీలించారు. భూమిలోపలి మ్యాంటిల్లో లభించిన రసాయన మిశ్రమమే ఇందులోనూ ఉన్నట్లు వాళ్లు తేల్చారు. కుజ, గురు గ్రహాల మధ్య ఉండే ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిన ఈ ఉల్క 2015లో అస్సాంలోని ఓ గ్రామం దగ్గర భూమిపై పడింది. ఐఐటీ ఖరగ్పూర్ జరిపిన ఈ అధ్యయన ఫలితాలను జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో ప్రచురించారు.
ఆలివిన్ అనే పదార్థంతో ఈ ఉల్క ఏర్పడినట్లు గుర్తించారు. భూమి మ్యాంటిల్ కూడా ఇలాగే ఏర్పడినట్లు తేల్చారు. ఈ ఆలివన్ను మ్యాంటిల్లో అత్యంత ముఖ్యమైన ఖనిజంగా చెబుతారు. అత్యధిక ఉష్ణోగ్రతలు, ఒత్తిడి మధ్య ఆలివిన్ కరిగినప్పుడు కనిపించే మిశ్రమాన్ని ఒక ఉల్కలో కనుగొనడం ఇదే తొలిసారి అని రీసెర్చర్లలో ఒకరైన డాక్టర్ సుజయ్ ఘోష్ చెప్పారు. ఆ లెక్కన మన భూమి మ్యాంటిల్లో ఉన్న రసాయన మిశ్రమం ఆస్టరాయిడ్ బెల్ట్లోనూ ఉన్నట్లేనని ఆయన అన్నారు.
రెండో పొర అయిన మ్యాంటిల్ ఉపరితలం నుంచి 660 కిలోమీటర్ల నుంచి 2700 కిలోమీటర్ల లోపలి వరకూ విస్తరించి ఉంది. ఇక భూమి కేంద్రం 6360 కిలోమీటర్ల లోపల ఉంది. ఇలాంటి లోతుల్లోని పదార్థాల గురించి అధ్యయనం చేయాలంటే అగ్నిపర్వతాలు పేలినప్పుడు అందులోని శిలాద్రవ నమూనాలను పరీక్షించాల్సిందే.