న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీయ ఆటో రంగ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్.. మార్కెట్లోకి మరో విద్యుత్తు ఆధారిత వాహనాన్ని విడుదల చేసింది. రూ.11.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్షోరూం)తో మంగళవారం టిగోర్ ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ)ను పరిచయం చేసింది. రూ.12.49 లక్షలు, 12.99 లక్షలు, 13.14 లక్షలతో మరో మూడు వేరియంట్లూ ఈ మోడల్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే టాటా మోటర్స్ నెక్సాన్ ఈవీ.. మార్కెట్లో అమ్ముడవుతున్న విషయం తెలిసిందే. కాగా, దేశవ్యాప్తంగా 70 నగరాల్లోని సుమారు 150 సేల్స్ ఔట్లెట్లలో టిగోర్ ఈవీ అమ్మకాలుంటాయి. గ్లోబల్ ఎన్సీఏపీ నుంచి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ టిగోర్ ఈవీకి లభించింది. పెద్దలు, పిల్లల ప్రయాణానికి ఇది సురక్షితమని ఎన్సీఏపీ పేర్కొన్నది. ఇక ఆటోమోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) ధ్రువీకరించిన రేంజ్ 306 కిలోమీటర్లుగా ఉన్నది. 65 నిమిషాల్లోనే 80 శాతం వరకు చార్జింగ్ అవుతుంది. దీనికి 8 ఏండ్లు, 1.60 లక్షల కిలోమీటర్ల బ్యాటరీ, మోటర్ వారంటీ ఉన్నది.