న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా దేశీయ మార్కెట్లోకి గురువారం న్యూ మోడల్ 2021 5-సిరీస్ కారును ఆవిష్కరించింది.దీని ధర రూ.62.90 లక్షల నుంచి మొదలవుతుంది. పెట్రోల్ వేరియంట్ (బీఎండబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్), రెండు డీజిల్ వేరియంట్లు (బీఎండబ్ల్యూ 530డీ ఎం స్పోర్ట్, బీఎండబ్ల్యూ 520డీ లగ్జరీ లైన్) మోడల్ కార్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. తక్షణం దేశంలోని డీలర్ల వద్ద బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
పెట్రోల్ వేరియంట్ బీఎండబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్ కారు కేవలం 6.1 సెకన్లలో ఈ కారు 100 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. డీజిల్ వేరియంట్ కార్లు 520డీ లగ్జరీ లైన్ మోడల్ 7.3 సెకన్లు, 530డీ ఎం స్పోర్ట్ వేరియంట్ 5.7 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని పుంజుకుంటాయి. ఇక వచ్చే నెల 24 వరకు ఎం స్పోర్ట్ వేరియంట్ కారుపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉంచినట్లు బీఎండబ్ల్యూ తెలిపింది.
చెన్నైలోని బీఎండబ్ల్యూ ప్రొడక్షన్ యూనిట్లో ఈ కారు ఉత్పత్తి చేశారు. పెట్రోల్ వేరియంట్ బీఎండబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్ కారు ధర రూ.62,90,000గా నిర్ణయించారు. అదే డీజిల్ వేరియంట్ బీఎండబ్ల్యూ 520డీ లగ్జరీ లైన్ మోడల్ రూ.63.90 లక్షలు కాగా, బీఎండబ్ల్యూ 530డీ ఎం స్పోర్ట్ – రూ.71.90 లక్షలకు లభిస్తుంది.
ఈ కారులో 2- లీటర్ల సామర్థ్యం గల 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 252 హెచ్పీ, 350 ఎన్ఎం టార్చి విడుదల చేస్తుంది. బీఎండబ్ల్యూ 5 సిరీస్ కార్లు తొలిసారి న్యూ కలర్ ఆప్షన్లలో లభ్యం కానున్నాయి.
ఫైటోనిక్ బ్లూ మెటాలిక్, బెర్నినా గ్రే అంబర్ ఎఫెక్ట్లతోపాటు అల్పైన్ వైట్, బ్లాక్ (నాన్ మెటాలిక్), మినరల్ వైట్, కార్బన్ బ్లాక్, బ్లాక్ షాఫైర్, గ్లాసియర్ సిల్వర్, బ్లూ స్టోన్ (మెటాలిక్) రంగుల్లో లభ్యం అవుతాయి.
న్యూ బీఎండబ్ల్యూ 5-సిరీస్ కార్లను న్యూ బోల్డ్ బీఎండబ్ల్యూ కిడ్నీ గ్రిల్లే, న్యూ స్లిమ్మర్ ఫుల్-ఎల్ఈడీ అడాప్టివ్ హెడ్ లైట్స్తో డిజైన్ చేశారు. ఎం స్పోర్ట్ వేరియంట్లలో బీఎండబ్ల్యూ లైజర్ లైట్ కొత్తగా యాడ్ అవుతుంది.