మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం ప్రగతి పథంలో నడుస్తుందని, మహిళలను గౌరవించని ప్రపంచం ఎక్కడా బాగుపడలేదని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభివర్ణించారు. రవీంద్రభారతిలో బీసీ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి వి. శ్రీనివాస్గౌడ్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, తెలంగాణ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ మహిళలు తల్లిగా, భార్యగా, కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ పిల్లలను బాధ్యతతో పెంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా రెడ్డి మాట్లాడుతూ షీటీంలు ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో బీసీ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు మణిమంజరి పాల్గొన్నారు.