హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్స కోసం డీఆర్డీవో అభివృద్ధి చేసిన ‘2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్’ (2-డీజీ) ఔషధంను డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ‘2డీజీ’ బ్రాండ్ పేరుతో ఈ ఔషధ సాచెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఒక్కో సాచెట్ ధర రూ.990గా నిర్ణయించిన సంస్థ.. ప్రభుత్వ దవాఖానలకు రాయితీపై అందిస్తామని చెప్పింది. వీటిని అవసరానికి అనుగుణంగా నేరుగా ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు పంపిణీ చేస్తామని కూడా స్పష్టం చేసింది. ముందుగా మెట్రో నగరాలు, ప్రథమ శ్రేణి నగరాల్లోని దవాఖానల్లో ఈ ఔషధం అందుబాటులో ఉండేలా చూస్తామని, ఆ తర్వాత మిగతా నగరాలు, పట్టణాలకు పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా కంపెనీ తెలియజేసింది.
ఇక ఇందులో 2.34 గ్రాముల పొడి ఉంటుందని, నీళ్లలో కలిపి తాగాల్సి ఉంటుందని పేర్కొన్నది. కాగా, 2-డీజీని డీఆర్డీవో అభివృద్ధి చేయగా.. రెడ్డీస్ ల్యాబ్స్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి డీసీజీఐ ఈ ఏడాది మే 1న అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది. 8న లాంఛనంగా ప్రారంభించారు. గత నెల 17వ తేదీ నుంచి రెడ్డీస్ ల్యాబ్స్ ప్రాథమిక పరిశీలన కోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన దవాఖానలకు 2-డీజీ సాచెట్లను పంపిణీ చేసింది. వీటిని ‘2డీఈజీఈ’ బ్రాండ్ పేరుతో అందజేసింది. ఈ క్రమంలోనే సోమవారం నుంచి వాణిజ్యపరంగా అందరికీ అందుబాటులోకి తెచ్చింది.